ఏపీ, తెలంగాణలో నామినేషన్ల దాఖలు పర్వం ఆఖరి దశకు చేరుకుంది. ఈనెల 25తో నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అటు.. ఏపీ సీఎం జగన్ సైతం ఆఖరి రోజు నామినేషన్ సమర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను జోరుగా వేస్తున్నారు. అయితే.. నామినేషన్ల దాఖలుకు ఈనెల 25 ఆఖరి రోజు కావడంతో తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏపీలోని 25 పార్లమెంటు స్థానాలకోసం ఇప్పటివరకు 417కు పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక, అసెంబ్లీ స్థానాల కోసం చూస్తే.. 175 సెగ్మెంట్లలో 2 వేల 350 నామినేషన్లు సమర్పించారు. గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతాయని భావిస్తున్నారు.
మరోవైపు ఈనెల 25న పులివెందులలో ఏపీ సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న సీఎం.. 11 గంటలా 25 నిమిషాల నుంచి 11 గంటలా 40 నిమిషాల మధ్య తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. అంతకుముందు పులివెందుల చేరుకోనున్న జగన్.. అక్కడి సీఎస్ఐ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11.25 నుంచీ 11.40 గంటల లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడి నుంచి కడపకు చేరుకొని.. కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం జగన్ నామినేషన్ ర్యాలీ కోసం వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలో కానీ, లేదంటే మరో విధంగా ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతీ రోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.