స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా 24వ మలుపు వద్ద జీపు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన పార్వతమ్మ అనే భక్తురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మార్గ మధ్యలో కర్ణాటకలోని రాయదుర్గంకు చెందిన రేణుకమ్మ అనే మరో భక్తురాలు కూడా ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న తిరుమల ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.