స్వతంత్ర వెబ్ డెస్క్: అసలు విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా అని బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే (Nishikant Dubey) ప్రశ్నించారు. ఆ కూటమి సభ్యులకు ఇండియా అంటే ఫుల్ ఫామ్ కూడా తెల్వదని సెటైర్లు వేశారు. కేంద్రంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మాట్లాడిన దూబే.. ఇది మోడీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కాదని.. ఏ పార్టీ ఎవరి వైపు ఉందో తెలుసుకోవడానికి పెట్టిన తీర్మానం అని ఎద్దేవా చేశారు.
రాహుల్ సభకు వస్తే పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారని.. ఇంకా సుప్రీం తీర్పు ఇవ్వలేదని.. జస్ట్ స్టే మాత్రమే ఇచ్చిందన్న విషయం తెలుసుకోవాలని దూబే సూచించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చర్చను ప్రారంభిస్తారనుకున్నాం కానీ ఆయన లేట్ గా నిద్రలేచినట్టున్నారని సెటైర్ వేశారు. లాలు, ములాయం, ఫరుఖ్ అబ్దుల్లాపై కేసు పెట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. మోడీ బీసీ కాబట్టే రాహుల్ కు సమాధానం చెప్పలేదన్నారు. రాహుల్ ఎప్పటికీ సావర్కర్ కాలేరని విమర్శించారు.
సోనియాగాంధీ తన కొడుకు, అల్లుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పరారీలో ఉన్న ఓ మోసగాడితో సోనియా అల్లుడికి సంబంధాలున్నాయని ఆరోపించారు. 2024లో మీలో ఏ ఒక్కరూ లోక్ సభకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, మోడీని ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతారని దూబే పేర్కొన్నారు.