కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన కేసు వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై రాష్ట్ర డీజీపీతో ఇప్పటికే చర్చించినట్లు వెల్లడించిన సీఎం.. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కారని, కేసులో ఎవరికి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా, ఈ నెల 8వ తేదీ రాత్రి 9 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఎం తెలిపారు. ఇదే సమయంలో కరీంనగర్లో భగీరథ్ కూడా తనవైపు నుంచి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రెండు వైపుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా 9, 10 తేదీల్లో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైందని సీఎం వివరించారు. వేలాది మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి రావడంతో కేసు విచారణ ప్రక్రియ కొంత ఆలస్యమైందని చెప్పారు. అయినప్పటికీ మోదీ పర్యటనను ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై పోలీసుల చర్యలు ప్రారంభమయ్యాయని సీఎం వెల్లడించారు. రెండు కేసులను కూడా నిష్పక్షపాతంగా విచారించేందుకు మహిళా ఐపీఎస్ అధికారిణిని విచారణాధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు, బాధితుల స్టేట్మెంట్లు నమోదు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కూడా సీఎం పరోక్ష విమర్శలు చేశారు. “ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.. ప్రస్తుతం పోలీస్ అధికారి కాదు” అని వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల పాటు ఐపీఎస్గా పని చేసిన ఆయనకు చట్ట ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు.
పోలీసులు ఎవరినీ వదిలిపెట్టరని స్పష్టం చేసిన సీఎం.. గతంలో కేటీఆర్ బామ్మర్ది కేసులో కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఈ కేసులో కూడా అదే విధంగా చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు.


