సోమనాథ్ ఆలయ రూపురేఖలు మారుస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో కుంభాభిషేకం చేశారు. ప్రధాని స్వయంగా జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ జరిపించారు. ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు.
ఈ ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ సోమనాథ్లో భారీ రోడ్ షో నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్ షోలో వేలాది మంది ప్రజలు పాల్గొని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో ప్రజలు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు.
సోమనాథ్ ఆలయంపై గజినీ, ఖల్జీ అనేక సార్లు దాడి చేసి దోచుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నిసార్లు దాడులు చేసినా సగర్వంగా నిలబడిందని ప్రధాని తెలిపారు. అసత్యంపై ఎప్పుడూ సత్యమే గెలుస్తుందని మన పూర్వీకులు నిరూపించారని స్పష్టం చేశారు.
1998లో ఇదే రోజున అణు పరీక్షలు చేపట్టామని మోదీ గుర్తు చేశారు. 1998లో అణు పరీక్షల ద్వారా భారత్ సత్తా చాటామని పేర్కొన్నారు. అప్పటి అణుపరీక్షలు చూసీ ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని ప్రధాని తెలిపారు. అణు పరీక్షల తర్వాత భారత్పై అనేక ఆంక్షలు విధించాయన్నారు. ఎవరి ఆంక్షలకు తలొగ్గలేదని.. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించామని మోదీ స్పష్టం చేశారు.


