పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశావహులకు ఆ సీటు హాట్ కేక్ లా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండగా. .ఇప్పుడు మరికొన్ని కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ సీనియర్లు బహిరంగంగా కోరుతున్నారు. ఇలా టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డజన్ మంది లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే, అధిష్టానం మాత్రం రాహుల్ గాంధీని ఇక్కడ నుండి పోటీ చేయిం చాలని భావిస్తుంది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని సీపీఐ పట్టుబడుతుండడం ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్ధానాలకంటే ఖమ్మం పార్లమెంట్ స్ధానంపై అందరి కన్ను పడింది. ఇక్కడి నుండి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు నేతలు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఇంతగా ఆశావహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇక సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ.. సోనియా కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే వీహెచ్ కూడా ఇక్కడి నుండే బరిలో దిగుతానంటూ పట్టుపడుతున్నారు. తనకంటే అర్హతలెవరికి ఉన్నాయో చెప్పాలని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ రీసెంట్ గా రేసులోకి వచ్చారు. హైదరాబాద్ సెంట్రల్గా పాలిటిక్స్ చేసే ఆయన, ఇటీవల ఖమ్మం డీసీసీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టి మరీ ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ తనకివ్వాలని హైకమాండ్ను కోరారు.
ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్తో పాటు వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. లేదంటే ఆమె కూడా రేసులో ఉండేవారే. తొలుత రాష్ట్ర నాయకత్వం సోనియాను ఖమ్మం నుండి పోటీ చేయిం చాలని భావించగా..ఆమె రాజ్యసభకు వెళ్లటంతో, రాహుల్ గాంధీని అయినా పోటీ చేయించాలని భావి స్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేయని పక్షంలో కాంగ్రెస్లో ఈ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు కామ్రేడ్లు కూడా ఖమ్మం సీటుపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని, ఒక్క అసెంబ్లీ సీటుతో సరి పెట్టుకున్న సీపీఐ, ఇప్పుడు తమకొక పార్లమెంట్ సీటు కేటాయిం చాలనే ప్రపోజల్ పెట్టింది.
రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో చర్చలు జరిపినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం హైకమాండ్ దేనని స్పష్టం చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీపీఐ జాతీయ నేతలు చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో తమకు పట్టున్న ఐదు ఆప్షన్లను కామ్రేడ్ల ముందుకు తెస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవల కొత్తగూడెం అసెంబ్లీ సీటును గెల్చుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానం వైపే సీపీఐ మొగ్గు చూపుతోంది. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో సీపీఐ పొత్తు పెట్టు కోగా, ఖమ్మం సీటును సీపీఐకి ఇచ్చారు. ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నకె.నారాయణ ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మళ్లీ ఇప్పుడు తమకే కేటాయించాలని సీపీఐ కోరుతోంది. హాట్ కేక్ లా మారిపోయిన ఖమ్మం పార్లమెంట్ సీటు చివరకు ఎవర్నీ వరిస్తుందో చూడాలి మరి.