గులాబీ బాస్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. ఉదయం పొలం బాట, సాయంత్రం బహిరంగ సభలతో బిజీబిజీగా గడపనున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ్టి నుంచి మే 10 వరకు అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఇందుకోసం ప్రచార రథాలకు పూజలు కూడా చేశారు. ప్రచార రథాలకు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సుయాత్రను కొనసాగిస్తారు.
ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా, కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం అధినేత విస్తృత స్థాయిలో ప్రజలను కలవనున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయం నాటి వాతావరణాన్ని తలపిస్తూ ఉద్వేగాన్ని తట్టి లేపేలా బస్సు యాత్ర కొనసాగుతుందని అంటున్నారు.