తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చగా… తాజాగా ఆ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ముందుగా కాంగ్రెస్ సహా మిత్రపక్షాల నేతలతో సమావేశమైన విజయ్… అనంతరం అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లారు. అక్కడ షణ్ముగం వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యేలతో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.
బుధవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ 47 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి నిర్ణయాలపై సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, సి. విజయభాస్కర్ తదితరులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత శనివారం జరిగిన పార్టీ సమావేశంలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు అంశం, శాసనసభా కమిటీ నాయకత్వ బాధ్యతలపై తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈపీఎస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి సమావేశాన్ని బహిష్కరించారు.
ఈ పరిణామాలతో అన్నాడీఎంకేలో చీలిక స్పష్టంగా బయటపడింది. ఇక ఈ ఉదయం షణ్ముగం వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. తాము అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. బలపరీక్షకు ముందు జరిగిన ఈ పరిణామాలు విజయ్ ప్రభుత్వానికి బలం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


