స్వతంత్ర వెబ్ డెస్క్: నేటి నుంచి నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండటంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు తగిన బదులు ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సిద్ధమైంది. నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు వారం కంటే తక్కువ రోజులే సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఆరు నెలల్లో కనీసం ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున.. గురువారం నుంచి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు, నాలుగు రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చునని భావిస్తున్నారు.
గురువారం ఉదయం కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యుడు సాయన్నకు సంతాపం వ్యక్తం చేయనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే అంశం ఖరారు కానుంది. ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. అయితే.. ఎన్నికల ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో అనేక సవాళ్లు ఫేస్ కాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బీఆర్ఎస్.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు.. ఇలా ఎవరి ప్లాన్లో వాళ్ళు సిద్ధమవుతుండడంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని అధికార బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు సమాచార సేకరణ చేశారు. అసెంబ్లీ సమావేశాలు టార్గెట్గానే వీఆర్ఎస్ల రెగ్యులరైజేషన్, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, మెట్రో విస్తరణ, రైతు రుణమాఫీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.