పార్టీ తలవంచుకునే పని ఎప్పుడూ తాను చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాను ఎలాంటి కుటుంబ రాజకీయాల ద్వారా ఎదిగిన నాయకుడు కాదని, కష్టపడి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడినని బండి సంజయ్ పేర్కొన్నారు. “భయపెడితే భయపడటానికి నేను ఫామ్ హౌస్లో ఉండే ఎలుకను కాదు” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలంతా మోదీ శిష్యులమని, ప్రాణాలు పోయినా తప్పు చేయమని, తప్పు చేసే వారిని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా సభా వేదికపై బండి సంజయ్ కంట తడి పెట్టారు.
తెలంగాణను అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో నాశనం చేసినవారే ఇప్పుడు బీజేపీపై ఎదురుదాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతిని అంతమొందించే వరకు పోరాటం కొనసాగిస్తామని, కుటుంబ పార్టీల రాజకీయాలను ప్రజలతో కలిసి భస్మం చేస్తామని అన్నారు. “ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
సభ మొత్తం “జై శ్రీరాం”, “జై తెలంగాణ” నినాదాలతో మార్మోగింది. ఈ నినాదాలే ప్రత్యర్థి పార్టీలకు భయాందోళనలు కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
జై శ్రీరాం నినాదం కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది దేశభక్తి, ధర్మ రక్షణకు ప్రతీక అని బండి సంజయ్ అన్నారు. బెంగాల్లో జై శ్రీరాం ఉద్యమం కారణంగానే అరాచక పాలనకు చెక్ పడిందని, అక్కడి రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చిందని చెప్పారు. బెంగాల్ తర్వాత బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణేనని స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ ఎదుగుదల చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని, ఆ రెండు పార్టీల పునాదులు కదులుతున్నాయని విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీ నుంచి భారీగా నిధులు తీసుకొస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ సంపదను ఢిల్లీకి తరలిస్తోందని ఆరోపించారు. “హిందీ మాట్లాడే మోదీ తెలంగాణకు నిధుల వరద పారిస్తుంటే, తెలుగు మాట్లాడే రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయడం లేదన్నారు.
తెలంగాణలో గడీలు బద్దలయ్యేందుకు బీజేపీ కార్యకర్తల పోరాటాలే కారణమని బండి సంజయ్ అన్నారు. పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగాలు, బలిదానాలను ఎప్పటికీ వృథా కానివ్వమని స్పష్టం చేశారు. దేశం, ధర్మం కోసం పోరాడాలనే భావజాలంతో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లో పెరిగామని, బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు.
చివరగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి నితిన్ నబిన్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే వరకు పోరాటం ఆగదని బండి సంజయ్ ప్రకటించారు.


