బయటకు తాజాగా కనిపించే కూరగాయలు నిజంగానే సహజసిద్ధమైనవేనా? అనే అనుమానాలను రేకెత్తించే ఘటన బిహార్లో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో దోసకాయలను ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయన ద్రావణంలో ముంచుతున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
బిహార్లోని కతిహార్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో ఓ మహిళ తాజాగా లేని, రంగు తగ్గిపోయిన దోసకాయలను పచ్చటి రంగు ద్రావణంతో నిండిన జార్లో ముంచుతూ కనిపించింది. కొద్దిసేపట్లోనే ఆ దోసకాయలు తాజాగా, ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగులో మెరిసిపోతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ వ్యవహారం రైల్వే ప్లాట్ఫారంపై బహిరంగంగానే జరుగుతుండటం, ప్రయాణికులు చూస్తుండగానే ఈ ప్రక్రియ కొనసాగినా, ఎవరూ అడ్డుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. ఆహార భద్రతా అధికారులు, రైల్వే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆహార నిపుణుల ప్రకారం… కూరగాయలకు కృత్రిమ రంగులు లేదా రసాయన ద్రావణాలు ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి రసాయనాలు శరీరంలోకి వెళ్లితే అలర్జీలు, జీర్ణ సంబంధ సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


