విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు. 2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుందని ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుందని సీఎం తెలిపారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1, 2026 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఈ కొత్త జోన్ పరిధిలోకి గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు రానున్నాయి. వాల్తేరు డివిజన్ను విభజించి ప్రత్యేకంగా విశాఖ డివిజన్గా మారుస్తున్నారు. ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి విడదీసి ఈ నూతన జోన్ను కేంద్రం రూపొందించింది.


