పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్కు షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. 15 ఏళ్లుగా ఎదురులేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి ఈ ఫలితాలు గట్టి షాకిచ్చాయి. బెంగాల్లో పాగా వేయాలన్న బీజేపీ కల ఈ సారి నెరవేరింది. పశ్చిమ బెంగాల్ లో కమలనాథులు అనుసరించిన వ్యూహం ఈ సారి పార్టీకి కచ్చితమైన ఫలితాన్ని తీసుకొచ్చింది. ఈ ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శకాన్ని ప్రారంభించినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారంలో ఉన్న టీఎంసీకి (TMC)కి ఈ ఎన్నికలు పెద్ద షాక్గా మారాయి.
మమత ఓటమికి కారణాలు ఇవేనా..?
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఓటమికి విశ్లేషకులు అనేక కారణాలు చెబుతున్నారు. ఒంటెద్దు పోకడ నిర్ణయాలు, మతపరమైన, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, అలాగే మంత్రులపై ఈడీ–సీబీఐ దర్యాప్తులు వంటి అంశాలు ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీశాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వివాదం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని చెబుతున్నారు.
సర్ వివాదంపై ఏ రాష్ట్రం చేయనంత హడావుడి ఒక్క మమత మాత్రమే చేయడంపై సుప్రీంకోర్టు కూడా మండిపడింది. 90 లక్షల ఓట్లు తొలగించడంతో సుప్రీంకోర్టు కూడా.. ఏకంగా 19 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి.. యుద్ధ ప్రాతిపదికన వివాదాన్ని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కౌంటింగ్ సమయంలో కూడా కేంద్ర ఎన్నికల పరిశీలకులను నియమించడంపై కూడా దీదీ సుప్రీంకోర్టుకు వెళ్లినా… ఈసీ నిర్ణయమే ఫైనల్ అని తెలిపింది.
ఇక రాజకీయ విమర్శలతో పాటు ఆర్థిక, పాలనా అంశాలు కూడా టీఎంసీకి ప్రతికూలంగా మారాయని విశ్లేషణలు చెబుతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మందగించడం, పెట్టుబడుల ఆకర్షణలో విఫలం కావడం, నిరుద్యోగం పెరగడం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయని అంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు, నియామకాలలో అక్రమాలు, శాంతిభద్రతల సమస్యలు కూడా ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపించాయని అంటున్నారు.
యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైందని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడుల సమయంలో ప్రభుత్వ వైఖరిపై కూడా విమర్శలు వచ్చాయి.
అంతేకాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ( Abhishek Banerjee) పాత్రపై కూడా రాజకీయ చర్చ జరిగింది. ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విపక్షాల నుంచి వచ్చాయి.
బీజేపీ వ్యూహాత్మక ప్రచారం
ఇక బీజేపీ విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi), హోంమంత్రి అమిత్ షా ( Amit Shah) వ్యూహాత్మక ప్రచారం పార్టీ విజయానికి దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ హామీలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ గణనీయమైన మద్దతు పొందిందని అంటున్నారు.
అలాగే హిందూ, ఆదివాసీ ఓటర్ల మద్దతు బీజేపీకి అనుకూలంగా మారడం కూడా ఈ భారీ విజయానికి కారణంగా మారాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


