తెలంగాణ పొలిటికల్ వార్లో చిక్కుకున్నాడు శ్రీరాముడు. అవును…. పార్టీలన్నీ శ్రీరామ జపాన్ని పఠిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.దీంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రాముడు అందరివాడంటూ హస్తం, గులాబీ నేతలు సెటైర్లు వేస్తుంటే,… వారికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు కమల నాథులు. దీంతో తెలంగాణలో రాముడి చుట్టూ రాజకీయం రవసవత్తరంగా సాగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు పార్టీ నేతలు. హిందుత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీని టార్గెట్ చేస్తూ శ్రీరాముడిని కూడా ఎన్నికల్లోకి దించుకుతున్నారు పొలిటికల్ లీడర్లు. రాముడు అంద రివాడంటూ జపిస్తున్నారు. గుడులలో భజనలు చేస్తున్నారు. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకుంటూ ముందుకు సాగుతోంది కాషాయ దళం. మోదీ వల్లే 500 ఏళ్లనాటి రామ మందిరం కల సాకారమైందని జబ్బలు చరుచుకుంటోంది. అలాంటి మోదీని మరోసారి గెలిపించాలని పిలుపునిస్తున్నారు కమలనా థులు. దీంతో వీరికి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. జైశ్రీరామ్ అనడం తప్ప చేసేదేమీ ఉండదని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రాముడు అందరివాడు.. రాముడితోని మనకేం పంచాయితీ. ఆయన బీజేపీ మనిషేం కాదు.. లోకప్రియుడు అన్నారు కేటీఆర్. తన పేరులోనే రాముడు ఉన్నాడని తెలిపిన ఆయన.. రాముడి పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అన్న నినాదంతో ముందుకు వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోపక్క హనుమాన్ చాలీసా చదివి అందరినీ అబ్బురపరిచారు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్రావు.
ఇక కాంగ్రెస్ నేతలు కూడా అదే రేంజ్లో కమలనాథులపై సెటారికల్ కామెంట్స్ విసురుతున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలోని రామమందిరంలో భక్తి పారవశ్యంతో శ్రీసీతారామచంద్రుల వారిని జపిస్తూ భజన కార్యక్రమంలో పరవశించిపోయారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. భక్తులతో కలిసి ఉత్సాహంగా పాటలు పాడారు. అనంతరం రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కమలనాథులపై తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోదీ ఫొటోతో ఓట్లు అడిగే పరిస్థితిలో బీజేపీ లేదని సెటైర్లు వేశారు. ఇంటింటికి అక్షింతలు వచ్చాయా అనే అంటున్నారు తప్ప.. అభివృద్ధి గురించిన ఊసే లేదని మండిపడ్డారు. ఇలా మొత్తానికి శ్రీరామచంద్రమూర్తి కూడా తెలంగాణ ఎన్నికల్లో నేతల అజెండా మారిపోయారు. వీళ్లు.. వాళ్లూ అని కాదు. ప్రధాన పార్టీ నేతలంతా రామనామ జపం చేస్తున్నారు. మరి కమలనాథులు కలలు కంటున్నట్టు అయోధ్య మందిరం బీజేపీకి భారీగా ఓట్లను కురిపిస్తుందా..? ఆ లోకప్రియుడు రాములోరి కరుణా కటాక్షం ఎవరిపై ఉంటుందన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.


