భారత్ – చైనా సరిహద్దుల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వివాదాలు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ చైనా తొండాట ఆడుతోంది. ఇందుకు అనుగుణంగా మ్యాప్ను కూడా మార్చేసింది చైనా. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం అంటూ అగ్రరాజ్యమైన అమెరికా స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అండగా నిలబడింది అగ్రరాజ్యమైన అమెరికా. ఈ విషయంలో చైనా అసంబద్ధ వైఖరిని తప్పుపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ నూటికి నూరుపాళ్లు భారత్ భూభాగమే అంటూ స్పష్టం చేసింది అమెరికా. అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించుకోవడానికి డ్రాగన్ చైనా చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టింది.
అరుణాచల్ ప్రదేశ్ విషయమై భారత్ – చైనాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని ఎన్నిసార్లు మన విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చెప్పినా, డ్రాగన్ చైనా వినిపించుకోవడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పనికిమాలిన వాదనలు చేస్తోంది. ఇటీవల చైనా రక్షణమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝూంగ్ షియాంగాంగ్ ఇదే పాట మరోసారి పాడారు. దీనిని భారత్ దీటుగా తిప్పికొట్టింది. నిరాధార వాదనలను పదే పదే వల్లెవేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్ చైనాకు మరోసారి స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. భారత్ – చైనా సరిహద్దుల్లోని తవాంగ్కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించడానికి ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తాజా పర్యటనను చైనా తప్పుపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పేర్కొంటోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ పాత పాటే మరోసారి పాడింది డ్రాగన్ కంట్రీ.
2020 జూన్ లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టును ప్రారంభించింది చైనా. యాన్-లిన్షి రైల్వే లైన్ ప్రాజెక్ట్ గా ఇది పాపులర్. ఈ రైల్వే ప్రాజెక్టు చేపట్టడం వెనక సైనికపరమైన లక్ష్యాలు ఉన్నాయని రక్షణరంగ నిపుణులు అనుమానిస్తున్నారు. సిచువాన్ -టిబెట్ రైల్వే లైన్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతానికి చైనా చాలా సులభంగా ఆయుధాలను, క్షిపణులను తరలించ వచ్చని మిలటరీ అధికారులు అంటున్నారు. దీంతో సిచువాన్ -టిబెట్ రైల్వే ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారింది.
సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి సరిహద్దుల్లో చైనా చేపట్టిన నిర్మాణాలు ప్రధాన కారణమంటున్నారు రక్షణరంగ నిపుణులు. పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా కొన్నేళ్ల కిందట ఓ చట్టాన్ని చేసింది.భారతదేశంతో సరిహద్దు గొడవలకు సంబంధించి చైనా ప్రత్యేకంగా చట్టం చేయడం ఇదే తొలిసారి అంటున్నారు మిలటరీ నిపుణులు. చైనా చేసిన ఈ ప్రత్యేక చట్టం ఫలితంగా రానున్న రోజుల్లో భారత్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి.
చైనా, పధ్నాలుగు దేశాలతో దాదాపు 22 వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. మనదేశం సంగతికి వస్తే చైనాతో 3,488 కిలోమీటర్ల మేర భూ సరిహద్దు ఉంది. ఇది మూడు సెక్టార్ ల ద్వారా వెళుతుంది. వెస్ట్రన్ సెక్టార్ అంటే జమ్మూ కాశ్మీర్, సెంట్రల్ సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉంటుంది. నార్త్ సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ల ప్రాంతాల నుంచి వెళుతుంది. చైనా, భారత్ మధ్య అనేక ప్రాంతాలకు సంబంధించి చాలాకాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవంటున్నారు నిపుణులు. దీంతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నే… ఇప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించడానికి ఒక ప్రామాణికంగా రెండు దేశాలు పెట్టుకున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ అంశం నేపథ్యంలో భారత్ -చైనా సరిహద్దుల దగ్గర కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ విషయాన్ని డ్రాగన్ చైనా లైట్గా తీసుకుంటోంది. పైపెచ్చు వివాదాస్పద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తోంది. ఇలాంటి నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చైనా చేసిన కొత్త చట్టం పేర్కొంటోంది. అంతేకాదు సరిహద్దుల్లో అక్రమంగా రైల్వే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టింది.
దాదాపు నాలుగేళ్ల కిందట.. గాల్వానా లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు ఇరవై మంది భారత సైనికులు చనిపోయారు. గాల్వానా ఘటనతో భారత్ – చైనా దేశాల మధ్య వివాదాలు మరింత తీవ్రమయ్యాయి. సహజంగా సరిహద్దులకు సంబంధించి పొరుగుదేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉంటాయి. అయితే ఈ విషయంలో డ్రాగన్ చైనాకు ఎటువంటి కట్టుబాటు ఉండదు. పొరుగుదేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న చిత్తశుద్ది చైనాకు లేదు. దీంతోనే భారత్ -చైనా మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రమవుతున్నాయని సైనికవర్గాలు పేర్కొంటున్నాయి.