స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కలిసి హుస్సేన్ సాగర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని స్థాయిలలోని అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని చెప్పారు. హుస్సేన్ సాగర్ రిజర్వాయర్కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో అనేక ప్రాంతాల్లో వరద ముంపు సమస్య తొలగిపోయిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
జంటనగరాల్లో భారీ వర్షాలతో బంజారా, పికెట్, కూకట్పల్లి నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్కు 40 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు, ప్రస్తుతం 513.62 మీటర్ల వద్ద ఉన్నది. దీంతో అధికారులు తూముల ద్వారా 5800 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోయర్ ట్యాంక్బండ్తోపాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.