స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.
అర్ద రాత్రి దాటడంతో డ్రైవర్ నిద్రను కంట్రోల్ చేసుకోలేక నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.. మరణించిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్(65),అబ్దుల్ హాని(60),షేక్ రమీజ్ (48),ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం(65),షేక్ షబీనా(35),షేక్ హీనా(6)గా గుర్తించారు.. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


