స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిందని.. రేపే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారని ఉదయం నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం సీఎంగా ఎవరినీ ఎంపిక చేయలేదని.. ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుందని క్లారిటీ ఇచ్చారు. సీఎంపై నిర్ణయం తీసుకోగానే తామే అధికారికంగా వెల్లడిస్తామని.. ఎలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు.
కాగా సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శికుమార్ తీవ్రంగా పోటీపడుతున్నారు. అయితే సీనియారిటీ ప్రకారం రాహుల్ గాంధీ సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్తో డీకే సమావేశమయ్యారు. రేసులో తాను వెనక్కి తగ్గబోనని రాహుల్కు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాహుల్తో భేటీ అనంతరం నేరుగా ఖర్గే నివాసానికి డీకే వెళ్లారు.
సీఎంగా సిద్ధరామయ్య ఎంపిక దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు. బెంగళూరులోని ఆయన నివాసం వద్ద కార్యకర్తలు భారీగా చేరుకుని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎంగా చేయాలని ఆ రాష్ట్ర ఎస్సీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఖర్గేను సీఎం చేస్తే సిద్ధూ, డీకేలు కూడా సైలెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.