Telangana Secretariat | తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన శ్వేతసౌదం, నూతన సచివాలయం ఆదివారం కొలువుదీరనుంది. ‘డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం’ అని పేరుతో నేడు సర్వాంగ సుందరంగా ప్రారంభం కాబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 1:20 నుంచి 1:32 మధ్య సీఎం కేసీఆర్… నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:56 నుంచి 2:04 మధ్య మంత్రులు, అధికారులు సీట్లలో ఆసీనులు అవుతారు. అనంతరం 2:15 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ఉద్దేశించి ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఉదయం నుంచే సచివాలయంలో పూజలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి వాస్తుపూజ, యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ్డి దంపతులు పాల్గొని యాగాన్ని సఫలీకృతం చేశారు. నూతనంగా కొలువుదీరిన శ్వేతసౌధాన్ని వీక్షిస్తూ భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్న నీళ్లకే నడక నేర్పి.. నదినే రిజర్వాయర్గా మలచుకున్న కాళేశ్వరం. నిన్న యాదగిరిగుట్టపై కొలువైన లక్ష్మీనారసింహుడికి అద్భుత ఆలయం. నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం.. అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.