పుష్యమాసం వచ్చిందంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాలు డోలు, డప్పు వాయిద్యాలతో సంద డే..సందడి. ఆదివాసీలు నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తూ తమ దైవాలను కొలుస్తుంటారు. ఆదివాసీలు, గోం డుల జీనవ పద్ధతులు ప్రత్యేకమైనవి. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఆశ్చర్యం కల్గిస్తాయి. ముఖ్యంగా పుష్య మాసం లో ఆదివాసీలు భక్తి శ్రద్దలతో తమ ఆరాధ్య దైవమైన జంగుబాయిని ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా సందర్శిస్తారు. భారతదేశంలోని ఆదివాసీలకు ఆది దైవం జంగుబాయి. జంగుబాయి జాతర ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కొనసా గుతోంది. తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర పై ప్రత్యేక కథనం.
ఆదివాసీలకు ప్రకృతికి విడదీయరాని బంధం.. వారి అలవాట్లు, ఆచారాలు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. కొండ కోనల్లో జీవనం .. అడవే జీవనాధారం.. వారి వేషధారణ, పూజలు, పండుగలు, జాతరలు ఇలా ప్రతి అంశం, శైలి భిన్నంగా ఉంటాయి. ప్రతి నెలా ఒక్కోమాసంలో ఒక్కో పూజా కార్యక్రమం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మం డలం కొటాపరందోలి బిడ్ వార్ సమీపంలో తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దులో ఉన్న అడవిలో జంగుబాయి పుణ్య క్షేత్రం ఉంది. పుష్యమాసంలో నెల రోజులపాటు ఆదివాసీలు నియమాలతో జంగుబాయిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.పుష్య మాసంలో నెలవంక కనిపించిన రోజు నుండి అమావాస్య వరకు ఆదివాసులు పవిత్ర మాసంగా భావిస్తారు. తమ ఇల్లు, వాకిలి శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పవిత్రంగా ఉంచుకుంటారు. నెలరోజుల పాటు ఆదివాసీలు ఎవరిళ్ళలోనూ తినరు. కనీసం మంచినీళ్ళు కూడా తాగరు. పాదరక్షలు ధరించరు. మద్యానికి దూరంగా ఉంటారు. జంగూబాయి వద్దకు వచ్చే భక్తులు చాలా మంది కాలినడకనే వస్తుంటారు. దూర ప్రాంతాల వారు ఎడ్ల బండ్లలో వస్తుంటారు.
దేవత అనగానే మనమంతా ఓ ఆకారం అని ఊహిస్తాం… కానీ ఇక్కడ ఆదివాసీ దేవతంటే ఒక వెలుగు అంతే.. చీకట్లను పారద్రోలే దీపాన్ని జంగూబాయి దేవత రూపంగా ఆరాధిస్తారు. అడవిలో ఓ నది. పక్కన ఎత్తైన కొండ మధ్య, గుహ లోపల కాంతులు వెదజల్లే దీపమే జంగుబాయి దేవత. ఆ దీపం ఉంచిన స్థలమే జంగూబాయి మహళ్ .. గుహా లోపలికి వెళ్లాలంటే కొంచం కష్టపడాల్సిందే. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోటా పరందోళి సమీపంలో ఈ ఆదివాసీల జంగుబాయి పుణ్యక్షేత్రం వెలసింది.
జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివస్తున్నారు. మన తెలుగు రాష్ట్రల నుంచే కాక, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రల నుండి ఆదివాసీలు జంగూబాయిని దర్శిం చుకుంటున్నారు. జంగుబాయి జాతర అంటే .. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే. ఎత్తైన కొండల నడుమ ఉన్న నదీ ప్రాంతాన్ని టొప్లకాస అని అంటారు. జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్ల కాస వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలు దిక్కులా మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి విన్యాసాలతో బయలు దేరుతారు. టొప్లకాస నుండి రావుడ్ పేన్ ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను దైవాల ప్రతిమలను గుళ్ళ లో పెట్టి మొక్కులు చెల్లించి, అవ్వల్ పేన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ మూడు చోట్లా పూజలు పూర్తయ్యాకే జంగు బాయిని దర్శించుకుంటారు.
అవ్వల్ పేన్ పూజ దర్శనం అయ్యాక అక్కడ నుండి జంగుబాయి మహాళ్ వద్దకు చేరుకొని, రాయితాడ్ పేన్ కు పూజలు చేసి, గుహ లోపల జంగుబాయి దీపాన్ని దర్శించుకుంటారు. ఈ గుహలో ఉన్న దీపమే జంగుబాయి.. పూ ర్వం ఇక్కడికి జంగుబాయి దీపం రూపంలో వచ్చినట్లు ఆదివాసీలు భావిస్తారు. జంగుబాయి ని దర్శనంతో ఆదివాసీ లకంతా మంచి జరిగిందని నమ్మకం. అప్పటి నుండి జంగుబాయి జాతర కొనసాగుతుందని ఆదివాసీలు చెబుతు న్నారు. ప్రతియేటా పుష్యమాసంలో జంగుబాయికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అందరూ తమ కుటుంబాలతో , వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా తమ దైవాలకు నైవేద్యం పెట్టి ఆ తరువాత విందు చేస్తారు. స్వచ్ఛమైన నువ్వుల నూనె , ఇప్ప నూనెలతో నైవేద్యం పెట్టాక ఆ నూనెలతోనే మహిళలు వంటకాలు గారెలు, బూరెలు అప్పాలు చేస్తారు. ఇవి ఆదివాసీలకు ప్రత్యేకమైనవి.
జంగుబాయి పుణ్యక్షేత్రంలో ముందుగా ఎనిమిది గోత్రాల వారు కటోడాలు ప్రకటించిన రోజున నియమనిష్టలతో జంగు బాయి సన్నిధికి వెళ్లి రాత్రిపూట దీపారాధన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. అప్పటి నుండి వారు అక్కడే ఉంటూ నిత్యం హాజరయ్యే భక్తులకు ముందుండి సంప్రదాయ పూజలు చేయిస్తారు. ఆదివాసీ తెగలలోని గొండు, కొలాం, ప్రధాన్, తోటి, మన్నేవార్ ఇతర తెగల వారు వారి వారి సాంప్రదాయ కట్టుబాట్లాననుసరించి వారి దైవా లైన జంగుబాయి, భీమయ్యక్, జంగున్ భుయ్యారీ.. భీం దేవ్.. భౌర్ పేన్, డొల్లార అవ్వల్ పెన్, కావడా పేన్ ఇలా ఒక్కోక్కరికి ఒక్కో దేవతల పేర్ల రూపంలో కొలుస్తుంటారు. తరతరాలుగా, వందల ఏళ్లుగా ఆదివాసీల సంప్ర దాయాలు కొనసాగుతున్నాయి. వారి డోలు వాయిద్యాలు.. సాంప్రదాయ నృత్యాలు, విన్యాసాలు… దేవతల వద్ద పూనకా లు… ఇవన్నీ అడవికి ఆదివాసీల అనుబంధానికీ అద్ధంగా నిలుస్తున్నాయి.


