వైసీపీ నియోజవర్గ ఇన్చార్జ్ల నాలుగో జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేతల్లో ఇప్పటినే టెన్షన్ మొదలైంది. ఈ సారి జాబితాలో తమ సీటు పదిలమా లేక పక్కన పెడతారా అని అరా తీస్తున్నారు నేతలు. ఇప్పటికే భంగపడ్డ నేతలు అసంతృప్తితో రగిలిపోతుండగా…మిగిలిన నియోజకవర్గ నేతల్లో అంతర్మదనం మొదలైంది.
రోజురోజుకు వైసీపీ ఇన్చార్జుల లొల్లి ముదురుతోంది. ఇప్పటికే మూడు జాబితాలు 51 ఎమ్మెల్యేలు, 6 ఎంపీ స్ధానాలకు ఇన్చార్జిలను నియమించిన అధిష్టానంపై సీటు రాని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పేరు రాని వారు తమ పరిస్థితి ఎంటో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మరోసారి తాడేపల్లి క్యాపు కార్యాలయానికి వచ్చారు. తనను దర్శి నుంచి తప్పిస్తున్నట్టు ఇప్పటికే అధిష్టానం సంకేతాలు ఇవ్వగా… రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. మూడవ జాబితాలో తన సీటును బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించారు. దర్శి సీటును బూచేపల్లికి ప్రకటించిన నేపధ్యంలో తనకు చూపిన ప్రత్యమ్నాయంపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందని వేణును తప్పించి… అక్కడ సీఎం తన సొంత సామాజిక వర్గానికి చెందిన బూచేపల్లికి ఇన్చార్జిగా నియమించడం పట్ల ఇప్పటికే నియోజకవర్గంలో సొంత పార్టీనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి సైతం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు. తన సొంత నియోజకవర్గం చీరాల నుండి తప్పించి పర్చూరు ఇన్చార్జిగా నియమించిన నాటినుండి అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ పెద్దలను కలవడం పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలిచి వైసీపీకి అనుబంధంగా పనిచే స్తున్న కరణం బలరాం ఉండగా… అదే స్ధానం నుండి తనకు సీటు కేటాయించాలని ఆమంచి పట్టు పడుతున్నారు. పార్టీ పెద్దలను కలసి వచ్చే జాబితాలో తనకు చీరాల నియోజకవర్గ బాధ్యతను అప్పగించాలని కోరారు. దీంతో ఆమం చి వ్యవహరం ఇప్పడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాధ్ రెడ్డి కొద్దీ రోజులుగా క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు.
ఇదిలా ఉంటే సంక్రాంతి తరువాత వచ్చే నాల్గవ లిస్ట్పై వైఎస్ఆర్సీపీ నేతల్లో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే 24మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన వైసీపీ మరెంత మందిపై వేటు వేస్తుందో అని నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందుగానే పార్టీ ముఖ్యనేతలను కలిసి తమ సీటు విషయంపై ఆరా తీస్తున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహద్రి రమేష్ బాబుతో పాటు పలువురు సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి సీటు ఉందా లేదా అని ఎంక్వైరీ చేస్తున్నారు. మరి సంక్రాంతి తర్వాత వెలువడే నాలుగో విడత జాబితాలో ఆశావాహులందరికీ అవకాశం దక్కుతుందో… ఎందరికి భంగపాటు ఎదురవుతుందో చూడాలి మరి.


