మాజీ మంత్రి వివేకానంద హత్యకు సంబంధించి ఏపీ సీఎం జగన్ సూటి ప్రశ్నలు వేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్.. వీరికి తోడు ఇద్దరు చెల్లెళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు? పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లు వైఎస్సార్ వారసులా? అని ప్రశ్నించారు. శత్రువులతో చేతులు కలిపిన వారు వైఎస్సార్ వారసులా.? అని నిలదీశారు.
వివేకానందరెడ్డిని దారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో తెలుసునని ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని అన్నారు. చిన్నాన్నకు రెండో భార్య, సంతానం ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు సీఎం జగన్.అవినాష్కు మద్దతుగా మాట్లాడేవారిపై కూడా ఆరోపణలు చేస్తున్నారని, అవినాశ్ను సమర్ధించిన వారిపై కుట్ర రాజకీయాలు చేయడం కరెక్టేనా.? అంటూ జగన్ నిలదీశారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో..చేతులు కలిపి వైఎస్సార్ పేరును తుడిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారని షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.