ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వైసీపీ మరో కీలక ఘట్టం పూర్తి చేసింది. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించిన ఏపీ సీఎం జగన్.. పెద్ద ఎత్తున కేడర్ వెంటరాగా ఉత్సాహంగా తొలి విడత ప్రచార పర్వాన్ని పూర్తి చేశారు. విపక్షాలపై విమర్శలు గుప్పించడమే కాదు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని అభ్యర్థిస్తూ ఒక్కో నియోజకవర్గంలో పర్యటిస్తూ ముందుకు సాగారు జగన్.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అదే మాదిరిగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకూ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారంలో ఏపీ సీఎం జగన్ అన్ని పార్టీల కంటే జెట్ దూసుకుపోతున్నారు. గతంలో సిద్దం పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహిం చారు. తాజాగా “మేమంతా సిద్ధం” పేరుతో బస్ యాత్ర చేశారు. గత నెల 27న ఇడుపుల పాయ నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభమైంది ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనల అనంతరం సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభించారు. జగన్ బస్ యాత్ర చివరి రోజు శ్రీకాకుళం జిల్లాలో జోరుగా కొనసాగింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ 20 రోజుల పాటు 22 జిల్లాల్లో యాత్ర కొనసాగించారు. యాత్ర 67 అసెంబ్లీ నియోజక వర్గాల లో పూర్తి అయింది. ఏకంగా 2015 కిలో మీటర్ల వరకు బస్ యాత్ర సాగింది. అయితే.. ఈ బస్ యాత్ర జరుగుతుండగానే అయన పై హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. ఈ నెల 13న విజయవాడలో బస్ యాత్ర కొనసాగుతుండగానే అయన పై రాయితో వేముల సతీష్ అనే వ్యక్తి దాడి చేశారు. దీంతో సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంలో గాయం అయింది. దాడి తరువాత ఒక రోజు బస్ యాత్రకి విరామం ఇచ్చినా తరువాత యాత్ర కొనసాగించారు. జగన్ బస్ యాత్రలో అటు పార్టీ నేతలు, ఇటు సామాన్య ప్రజానీకంతో మమేకం అవుతున్నారు. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా, ప్రాంతం అనే భేదం లేకుండా వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు బస్ యాత్రలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. జగన్ కు మేము సైతం తోడున్నామంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అటు జగన్ సైతం ఈసారీ రాబోయేది మనమేనని చెబుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు.
విశాఖ బస్ యాత్రలో భాగంగా సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై నేతలతో చర్చించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో లో దాదాపు తొంభై శాతం పైగా హామీలు అమలు చేశామని వైసిపి చెబుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో గత ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన పెన్షన్లు, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలకు నిధులు పెంచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో మరోసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ కేడర్.