స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐటీ రంగ నిపుణుడు, ఆధార్ రూపకర్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని దాతృత్వంలో కొత్త రికార్డు నమోదు చేశారు. తన పూర్వ విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేకి రూ.315 కోట్ల భూరి విరాళం ప్రకటించారు. నీలేకని గతంలోనూ ఐఐటీ బాంబేకి రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన మొత్తంతో కలిపి చూస్తే ఆయన విరాళం రూ.400 కోట్లకు చేరింది. దేశంలో ఓ పూర్వ విద్యార్థి ఒక విద్యా సంస్థకు ఇచ్చిన భారీ విరాళం ఇదే కావడం గమనార్హం.
1973లో ఐఐటీ బాంబేలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ చేశారు. తన విరాళంతో ఆ విద్యా సంస్థలో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు పెంచనున్నట్లు చెప్పారు. టెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్ను డెవలప్ చేయనున్నట్లు ఓ ప్రకటలో వెల్లడించారు. ఐఐటీ బాంబే తన జీవితంలో ఓ కీలకమైందని, తన భవిష్యత్తును తీర్చిదిద్దిందని, నా భవిష్యత్తుకు ఫౌండేషన్ వేసిందని, ఆ ప్రఖ్యాత విద్యా సంస్థతో 50 ఏళ్ల అనుబంధం ఏర్పడిందని, ఆ సంస్థ భవిష్యత్తుకు తోచిన రీతిలో సహాయం చేయదలుచుకున్నానని నందన్ నిలేకని తెలిపారు.