అమరావతి కేంద్రంగా రాష్ట్ర ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతం, ఆదాయ వృద్ధి లక్ష్యాల సాధనపై వివిధ శాఖలకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదాయంలో వచ్చే ప్రతి రూపాయి ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి సద్వినియోగం కావాలని సీఎం స్పష్టం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షలో వెల్లడైన వివరాల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,04,345 కోట్లుగా నమోదైంది. 2025-26 నాటికి ఇది రూ.1,10,643 కోట్లకు చేరనున్నట్లు అంచనా వేశారు. ఏడాది వ్యవధిలో స్టేట్ ఓన్ రెవెన్యూలో 6 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు సీఎంకు వివరించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.33,679 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. గనుల శాఖ నుంచి రూ.10,300 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.11,047 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు వెల్లడించారు. ఇక 2026-27 నాటికి రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.1,27,506 కోట్లకు పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆదాయార్జన శాఖలు కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయ వృద్ధి కోసం శాఖల మధ్య సమన్వయం మరింత పెరగాలని, లక్ష్య సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు.


