బీహార్లోని ఎనిమిది నియోజకవర్గాలకు ఆరో విడతలో భాగంగా ఈనెల 25న ఎన్నికలు జరగనున్నాయి. వాల్మీకినగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్హర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహరాజ్ గంజ్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య పోరు నడుస్తోంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీ యూ, హిందూ స్థానీ, ఆవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్మార్చా, లోక్ జనశక్తి ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ వికాస్శీల్ పార్టీలున్నాయి.
వాల్మీకి నగర్ బీహార్లోని అత్యంత సున్నిత నియోజకవర్గం ఇది. ఈ సెగ్మెంట్ చంపారన్ జిల్లాలో ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉండటంతో వాల్మీకి నగర్లో నక్సలైట్ల ప్రాబల్యం కూడా ఎక్కువే. 2019 ఎన్నికల్లో జేడీ యూ వాల్మీకినగర్ నుంచి విజయం సాధించింది. ఈసారి జనతాదళ్ యూ, రాష్ట్రీయ జనతాదళ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆర్జేడీ నుంచి దీపక్ యాదవ్ పోటీలో ఉన్నారు. జేడీయూ నుంచి సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీ శిబిరంలో చేరడంతో ఇక్కడ ఎన్డీయే కూటమి బలంగా ఉంది. పశ్చిమ చంపారన్ బీహార్లోని మరో కీలక నియోజక వర్గం ఇది. మహాత్మా గాంధీ తన తొలి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన నేత చంపారన్.2008 లో పశ్చిమ చంపారన్ నియోజకవర్గం ఏర్పడింది. పశ్చిమ చంపారన్ నియోజకవర్గం బీజేపీకి చాలాకాలం నుంచి అడ్డాగా ఉంది. 2009, 2014,2019 ఎన్నికల్లో పశ్చిమ చంపారన్ నుంచి బీజేపీ అభ్యర్థులే గెలిచారు. కాగా మూడు ఎన్నికల్లో విజయం సాధించిన సంజయ్ జైశ్వాల్ నాలుగో సారి పశ్చిమ చంపారన్ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ తివారీ పోటీ చేస్తున్నారు.
శివ్హర్, బీహార్లోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. ఈ ప్రాంతానికి వరదలు వస్తే, మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. 2014,2019 మధ్య శివ్హర్ నుంచి బీజేపీ విజయం సాధిం చింది. బీజేపీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గాన్ని ఈసారి నితీశ్ కుమార్ పట్టుబట్టి తీసుకున్నారు. జేడీ యూ తరఫున లవ్లీ ఆనంద్ బరిలోఉన్నారు. కాగా రాష్ట్రీయ జనతాదళ్ తరఫున రీతూ జైశ్వాల్ పోటీ చేస్తున్నారు. చంపారన్ ప్రాంతంలో భాగమే తూర్పు చంపారన్. కొంతకాలంగా తూర్పు చంపారన్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. 2009,2014,2019 ఎన్నికల్లో తూర్పు చంపారన్ ప్రాంతం నుంచి రాధా మోహన్ సింగ్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో రాధామోహన్ సింగ్ నాలుగో సారి బరిలో దిగారు. కాగా ఇండియా కూటమిలోని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నుంచి రాజేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గ్యారంటీలపై బీజేపీ ఆధారపడుతుంటే, నిరుద్యోగ సమస్యను ప్రధాన అస్త్రంగా చేసుకుంది ఇండియా కూటమి.
వైశాలి నియోజకవర్గం మిథిల ప్రాంతంలో ఉంటుంది. జైన మహావీరుడి జన్మస్థలం ఇది. ఇక్కడి ఓటర్లు, సామాజికవర్గా ల వారీగా విడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో వైశాలి నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి విజయం సాధించింది. ఈసారి లోక్ జనశక్తి తరఫున సిట్టింగ్ ఎంపీ వీణాదేవి పోటీ చేస్తున్నారు. కాగా రాష్ట్రీయ జనతాదళ్ తరఫున విజయ్ కుమార్ శుక్లా బరిలో ఉన్నారు. గండక్ నదీతీరాన ఉన్న నియోజక వర్గం గోపాల్గంజ్. ఇక్కడి ప్రజలు భోజ్పురి మాట్లాడ తారు. ఈన నియోజకవర్గంలోని పల్లె ప్రాంతాలు ఎక్కువ. 93 శాతం మంది ఓటర్లు గ్రామాల్లోనే ఉంటారు. బీహార్లోని అత్యంత వెనుకబడిన నియోజక వర్గాల్లో గోపాల్గంజ్ ఒకటి. 2019 గోపాల్గంజ్ లో జేడీ యూ గెలిచింది. ఈసారి జేడీ యూ తరఫున సిట్టింగ్ ఎంపీ అలోక్ కుమార్ సుమన్, ఇండియా కూటమి తరఫున ప్రేమ్ నాథ్ చంచల్ పోటీ చేస్తున్నారు.
సివాన్ నియోజకవర్గం గతంలో కోసల రాజ్యంలో ఉండేది. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ జన్మ స్థలం సివాన్ ప్రాంతమే. ఒకప్పుడు సివాన్ ప్రాంతం జనసంఘ్కు కంచుకోట. 2019లో జేడీ యూ తరఫున పోటీ చేసిన కవితా సింగ్ గెలిచారు. ఈసారి కవితా సింగ్ మరోసారి పోటీలో ఉన్నారు. కాగా ఆర్జేడీ నుంచి అవధ్ బిహారీ చౌధరి బరిలో ఉన్నారు. ముస్లిం మైనారిటీలు, బ్రాహ్మణులు, రాజ్పుత్లు ఇక్కడ నిర్ణయా త్మక శక్తిగా ఉన్నారు. మహరాజ్గంజ్లో రాజ్పుత్ల జనాభా ఎక్కువ. ఒకప్పుడు మహరాజ్గంజ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే కాలక్రమం లో కాంగ్రెస్ కంచుకోట బీటలు వారింది. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ విజయం సాధించారు. ఈసారి మరోసారి జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఆకాశ్ కుమార్ సింగ్ పోటీలో ఉన్నారు. సిగ్రీవాల్కు క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. కాగా ఆకాశ్ ఈసారి భూమిహార్ కార్డును ప్రయోగిస్తున్నారు.


