ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ కానిస్టేబుల్ ప్రాణాలు తీసింది. కాకినాడ గాంధీనగర్ ప్రాంతంలోని రెడ్క్రాస్ సమీపంలో ఆదివారం రాత్రి ఈ హత్య సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు జీ. నాగేశ్వరరావు (46) ఏపీఎస్పీ కానిస్టేబుల్గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లు సమాచారం.
ఆదివారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో నాగేశ్వరరావు మరో వ్యక్తితో కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏదో విషయంపై మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. వాగ్వాదం కాస్త తీవ్రరూపం దాల్చడంతో ప్రత్యర్థి వ్యక్తి నాగేశ్వరరావును బలంగా తోసి రోడ్డుపై పడేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన తల రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.
హత్యకు కారణమైన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు, అక్కడ ఉన్న ఇతర వ్యక్తుల వివరాలు, మద్యం సేవించిన ప్రదేశం తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఒకప్పుడు పోలీస్ శాఖలో పనిచేసిన వ్యక్తి ఇలా ఘర్షణలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


