అమరావతి: అనధికారికంగా విధులకు గైర్హాజరైన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 51 మంది వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తప్పించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఉద్వాసనకు గురైన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. వీరిలో కొంతమంది ఆరేళ్లకు పైగా విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 ప్రకారం, ఏడాదికి పైగా విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్లుగా పరిగణించి ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటికే సంబంధిత వైద్యులకు సంజాయిషీ నోటీసులు జారీ చేసి తగిన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విధుల్లో అలక్ష్యం ప్రదర్శించే వారిపై ఇకపై మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సొంత వ్యాపకాలే కారణం
బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు సొంత వ్యాపకాలలో నిమగ్నమై విధులకు గైర్హాజరవుతున్నారని గుర్తించారు. దీని ప్రభావం రోగులకు అందాల్సిన వైద్య సేవలపై పడుతున్నందున ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించింది. డీఎంఈ అధికారులు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి వివరాలు సేకరించి పూర్తి జాబితా రూపొందించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లే ఎక్కువ
ఉద్వాసనకు గురైన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అత్యధికంగా ఉన్నారు. కడప, అనంతపురం, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, మార్కాపురం ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ట్యూటర్లలో ఒకరు ఏడేళ్లుగా విధులకు దూరంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఇంకా చర్యలు కొనసాగుతాయి
మరో ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అలాగే 33 మంది వైద్యులకు ఛార్జిమెమోలు జారీ చేయగా, ఇప్పటికే 11 మంది విధుల్లో తిరిగి చేరారు. మిగిలిన వారు నిర్ణీత గడువులో స్పందించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వం జీరో వేకెన్సీ పాలసీ కింద ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు


