నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు. దీంతో మధ్యతరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయమన్నారు. బడ్జెట్పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్నాయుడు మాట్లాడారు.
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. గురజాడ అప్పారావు మాటలను గుర్తుచేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడం తెలుగువారందరికీ గర్వకారణమని రామ్మోహన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు దఫాలుగా కేంద్రంతో సీఎం చంద్రబాబు సంప్రదింపులు జరిపారన్నారు. జల్జీవన్ మిషన్ కింద చేపట్టే పనుల గడువు ముగుస్తున్నందున వాటిని పొడిగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారని, బడ్జెట్లో ఆ మేరకు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారని తెలిపారు. జల్జీవన్ మిషన్ పనులను 2028 వరకు పొడిగించారన్నారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగు నీరు అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
గత ప్రభుత్వం రూ.15వేల కోట్ల జల్జీవన్ మిషన్ నిధులను వినియోగించుకోలేదని రామ్మోహన్ విమర్శించారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారని.. దీని ద్వారా ఏపీకి ప్రయోజనాలు దక్కనున్నాయని తెలిపారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించడంపై నిర్మలా సీతారామన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.