స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికలకు మరో 9నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు నెల్లూరు జిల్లాలో అయితే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. గత ఎన్నికలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చకచకా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అవ్వగా.. ఆనం రామనారాయణరెడ్డి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.
తాజాగా అదే జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి యువనేత నారా లోకేశ్తో సమావేశమయ్యారు. కడప జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ను మేకపాటి కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు టీడీపీలో చేరనుండడంతో నెల్లూరు జిల్లాలో ఈసారి వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందనే చర్చ మొదలైంది.