స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వ్యభిచారంపై ఆసక్తికర తీర్పును వెలువరించింది ముంబయి సెషన్స్ కోర్టు. వ్యభిచారం నేరం కాదని.. అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం చేయడం వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ముంబయిలోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపర్చగా విచారించిన న్యాయస్థానం… ఆమెను ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చింది. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు.. ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని తీర్పును వెల్లడించింది. బాధితురాలు మేజర్ కావడం.. అలాగే ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను నిర్బందించడం ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని స్పష్టం చేసింది. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. అందువల్ల ఆమె నేరం చేసినట్టు కాదని వివరిస్తూ తీర్పును వెల్లడించింది.