తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగిన డీఎంకే – ఏఐఏడీఎంకే రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెడుతూ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విజయ్ తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలవడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీలో ఇద్దరు నేతలు ఏ అంశాలపై చర్చించారన్నది అధికారికంగా బయటకు రాకపోయినా, రాష్ట్ర రాజకీయాల్లో దీని ప్రాధాన్యతపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
చెన్నైలో జరిగిన ఈ సమావేశానికి .. నల్లటి సూట్ ధరించి వచ్చిన విజయ్, స్టాలిన్కు చేతులు జోడించి నమస్కరించగా.. స్టాలిన్ కూడా అదే విధంగా స్పందించారు. ఎన్నికల సమయంలో తీవ్ర రాజకీయ పోటీ నెలకొన్నప్పటికీ, ఎన్నికల అనంతరం పరస్పర గౌరవంతో వ్యవహరించడం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త వాతావరణాన్ని తీసుకువస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ సహా కొన్ని చిన్న పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అనేక రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే కలిసి పనిచేసే అవకాశాలపై కూడా ఊహాగానాలు వినిపించాయి. చివరకు విజయ్ కాంగ్రెస్ మరియు మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. “మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నాను. అయితే ప్రభుత్వం వద్ద డబ్బు లేదని వెంటనే చెప్పొద్దు ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం ఉంటేనే మంచి పరిపాలన సాధ్యమవుతుంది” అని స్టాలిన్ పేర్కొన్నారు.
గత డీఎంకే ప్రభుత్వ ఆర్థిక విధానాలను సమర్థిస్తూ స్టాలిన్ స్పందించారు. “కోవిడ్, వరదలు, అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, మేము ఐదేళ్ల పాటు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం” అని ఆయన తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చామని విజయ్ తన తొలి ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను కూడా స్టాలిన్ ఖండించారు.
“తమిళనాడు అప్పుల స్థాయి అనుమతించిన పరిమితుల్లోనే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫిబ్రవరి బడ్జెట్లోనే స్పష్టంగా వివరించాం. మీకు అది తెలియదా?” అంటూ స్టాలిన్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వాన్ని నిందించడం రాజకీయంగా మంచిది కాదని సూచించారు.
మరోవైపు విజయ్ ప్రభుత్వం ఏర్పాటుతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యాన్ని చెరిపేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన విజయ్, ఇప్పుడు పరిపాలనలో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయన ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.


