ట్విట్టర్ వేదికగా మరోసారి రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు. 6నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో విత్తనాల కొరతపై స్పందించిన కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జోగిపేటలో విత్తనాల కోసం పాసుబుక్కులను క్యూగా పెట్టిన ఫొటోని షేర్ చేశారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడీలు, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లను చూస్తున్నామన్నారు. ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నామని పేర్కొన్నారు.సాగునీరు లేక ఎండిన పంట పొలాలు ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి, పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు.అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదంటూ ధ్వజమెత్తారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలన లో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు కేటీఆర్.


