స్వతంత్ర, వెబ్ డెస్క్: మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే ‘భరతమాత బిడ్డ’ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాడ్సే.. గాంధీ హంతకుడు కావొచ్చని కానీ ఆయన భరతమాత బిడ్డ కూడా అన్నారు. భారతదేశంలోనే పుట్టాడు.. బాబర్, ఔరంగజేబుల మాదిరిగా పరాయి దేశం నుంచి వచ్చిన ఆక్రమణదారుడు కాదని వ్యాఖ్యానించారు. బాబర్ వారసులుగా పిలిపించుకునేందుకు ఇష్టపడేవారు.. ఎప్పటికీ భరతమాత బిడ్డలు కాలేరంటూ వెల్లడించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన ‘గాడ్సే వారసులు’ వ్యాఖ్యలకు ఈ మేరకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
కాగా టిప్పూ సుల్తాన్, ఔరంగజేబులకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల నేపథ్యంలో కొల్హాపూర్లో అల్లర్లు జరిగాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అల్లర్లు సృష్టిస్తున్న వారు ఔరంగజేబు వారసులంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఔరంగజేబు వారసుల గురించి అంతా తెలిసిన మీకు.. గాడ్సే, ఆప్టేల వారసుల గురించి కూడా తెలియాలి కదా అని విమర్శించారు.