పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 192 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక ప్రకటన చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరిట బీజేపీ ఓట్లలో అక్రమాలు చేసిందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
ఏజెంట్లు, అభ్యర్థులు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. “ఇది బీజేపీ పన్నాగం. మొదటి రెండు, మూడు రౌండ్లలో వారే ముందంజలో ఉన్నట్లు చూపిస్తారని నేను ముందే చెప్పాను. కొన్ని చోట్ల రెండు, మూడు రౌండ్ల తర్వాత కౌంటింగ్ను ఆపివేశారు” అని తెలిపారు.
అదేవిధంగా, టీఎంసీని అణగదొక్కడానికి కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తున్నారని, సీట్ల ఆధిక్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా కేంద్ర బలగాలతో కలిసి పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర బలగాలకు పూర్తిగా లోబడి పనిచేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంలో పార్టీ ఏజెంట్లు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఇంకా అనేక రౌండ్లు మిగిలి ఉన్నాయని, తుది ఫలితాల్లో విజయం తమదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


