స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామని ప్రకటించారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “దారి పొడుగునా రైతులను కలిసాం. వారంతా చెప్పేది ఒక్కటే. మేం దోపిడీలు, దొంగతనాలు.. అవినీతి చేయలేదు. కాంట్రాక్టులు చేయలేదు. నలుగురికి అన్నం పెట్టే మేము.. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా పంట కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాం అని అన్నారు. వర్షాలు రాక ముందే పంటను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.” అని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేస్తే, 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. విపక్షాలు ప్రశ్నిస్తే గాని ధాన్యం కొనరా అంటూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.