ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆయన సహచరులు పార్టీ సీనియర్లు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కూడా జైలులో ఉన్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమిలో భాగమైన ఆప్ పరిస్థితి ఏంటి.. కేజ్రీవాల్ లేకుండా.. ఎన్నికలను ఎదుర్కోగలదా.. ఆయన స్థానాన్ని ఆప్ లో ఎవరైనా భర్తీ చేయగలరా?
కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాట యోధుడు గానే ఎదిగాడు. అన్నాహజారేతో కలిగి ఉద్యమించి, ఆమ్ ఆద్మీపార్టీ ఏర్పాటు చేసి విప్లవాత్మక విధానాలు చేపట్టి ఢిల్లీ సీఎంపదవి చేపట్టాడు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇరుక్కుని అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం సాగించిన ఆయన అవినీతి కుంభకోణంలోనే చిక్కడం విచిత్రం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఏప్రిల్ 1వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ పార్టీ వ్యవహారాలకు సారథ్యం వహిస్తున్నారు. పదేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ వరుసగా రెండు సార్లు ఢిల్లీలో ఆప్ ను చారిత్రాత్మక విజయాలకు తీసుకెళ్లారు. పంజాబ్ లో పార్టీని అధికారంలో నిలిపారు. కేజ్రీవాల్ కు నమ్మకస్తులైన కొందరు లెఫ్టినెంట్ల తిరుగుబాటు చేసి దూరమైనా, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి వారు జైలు పాలుకావడంతో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు ఆయన జీవితంలో అత్యంత క్లిష్టమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ తెలివైన రాజకీయ నాయకుడైన ఆయన జైలుకు వెళ్లే ముందు తన రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆయన లేని లోటును పెద్దగా ఫీల్ అవ్వకుండా ఉండేందుకు చాలా మందికి కచ్చితమైన పాత్రలు ఇచ్చారు.
కేజ్రీవాల్ కు బెయిల్ దొరికి విడుదలైతే సరేసరి.. లేని పక్షంలో కేజ్రీవాల్ గైర్హాజరీలో ఆమ్ ఆద్మీపార్టీ లోక్ సభ ఎన్నిక లను ఎదుర్కోవలసి ఉంటుంది. 2024 ఎన్నికల్లో పార్టీని వ్యూహాత్మకంగా నడిపించేందుకు.. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ కేబినెట్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సంసిద్ధమవు తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సునీతా కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా వీడియో సందేశాలు, క్రమం తప్పకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ఆమె తన ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఐఆర్ ఎస్ అధికారి అయిన సునీత కేజ్రీవాల్ ఆప్ కమ్యునికేషన్ వ్యూహంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ఆకట్టుకునే బ్రాండ్ అయిన కేజ్రీవాల్ ఇప్పటికీ ఉంది. ఆమె పేరులో కేజ్రీవాల్ ఉండడం ఓ అడ్వాంటేజ్.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా ఎదుగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన మన్ ఢిల్లీ సీఎం నుంచి రాజకీయాల్లో మెళకువలు నేర్చుకున్నారు. వీరిద్దరూ తరచూ వివిధ రాజకీయ పర్యటనలు, ర్యాలీల్లో కలిసి కనిపిస్తుంటారు. పంజాబ్ సీఎంగా మన్ ఢిల్లీ కంటే పెద్ద రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నారు. వనరులను చాకచక్యంగా నావిగేట్ చేయగల సార్థ్యం, మూడేళ్లకు పైగా ఢిల్లీ పొలిటికల్ సర్క్యూట్ పై అవగాహన పార్టీలో వర్చువల్ నెం.2గా ఎదిగేందుకు దోహదపడింది. ఢిల్లీ కేబినెట్ మంత్రిగా దూసుకొచ్చిన వనిత అతిషి. తొలిసారి ఎమ్మెల్యే అయినా, ఆమె అతి తక్కువ కాలంలోనే ఆప్ అధిష్ఠానంలో కీలక మంత్రిగా ఎదిగారు. అంకితభావం, సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి సీనియర్లు లేకపోవడం ఆమె స్థాయిని పెంచింది. వివేకం వ్యూహాత్మక చతురతతో ఆమె కీలక పాత్ర వహించేందుకు సిద్ధమవుతున్నారు.
కేజ్రీవాల్ కు సన్నిహితుడుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి గా ఉన్నారు. వీరుకాక పార్టీ వెనుక వ్యూహరచనలో మరో కీలక వ్యక్తి సందీప్ పాఠక్. అరవింద్ కేజ్రీవాల్ వంటి నిష్ణాతు డైన సాంకేతిక నిపుణుడు. ఐఐటి-ఢిల్లీ మాజీ ప్రొఫెసర్, ఇప్పుడు ఆప్ సంస్థాగత కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తు న్నారు. రోజువారీ కమ్యూనికేషన్ వ్యూహాన్ని నిర్వహించడం, మీడియాలో కథనాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహి స్తున్న మరో వ్యక్తి జాస్మిన్ షా, జాస్మిన్, సౌరభ్ భరద్వాజ్. ఇప్పుడు వీరంతా పార్టీని ఎన్నికల విజయం దిశగా నడిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.