మే 31వరకు సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్ కళాశాలల విద్యార్ధులకు నేటి నుండి సెలవులు ప్రారంభమయ్యాయి. మే 31వ తేదీ వరకు కళాశాలలకు సెలవులుగా పేర్కొంది ఇంటర్ బోర్డు. కళాశాలలు తిరిగి జూన్ 1వ తేదీ తెరుచుకోనున్నాయి.
రన్ ఫర్ జీసస్
ప్రపంచ శాంతి కోసం జీసస్ చేసిన త్యాగం వృధాకాదన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” నిర్వహించారు. మున్సిపల్ టీ జంక్షన్ నుండి లక్ష్మీ నగర్ మీదుగా ఐదో ఇంక్లైన్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో చేపడుతున్న రామగుండం నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు ఎమ్మెల్యే.
తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
అల్లూరి జిల్లా పాడేరులో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాడేరు టీడీపీ అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడును ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కరపత్రాలను దగ్ధం చేసారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేకుండా పోయిందన్నారు. డబ్బులకు అమ్ముడుపోయిన టీడీపీ నేతలకు బుద్ది చెబుతామన్న నేతలు గిడ్డి ఈశ్వరిని స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసారు.
అక్రమ నీటి వ్యాపారానికి చెక్
నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని నీటి వ్యాపారాన్ని చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ , వట్టినాగులపల్లి గ్రామాలలో అక్రమం గా నిల్వ ఉంచిన నీటి స్థావరాలను ధ్వంసం చేశారు. జేసీబీ ల సాయంతో తాత్కాలిక నీటి స్థావరాలను ధ్వంసం చేసి బోర్లను సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఏనుగుల దాడి – ఆవు మృతి
చిత్తూరు జిల్లా సోమల మండలం అన్నెమ్మగారి పల్లెలో ఆవుల కొట్టంపై ఏనుగులు దాడి చేసాయి. ఈ దాడిలో ఒక ఆవు మృతిచెందగా, మిగిలిన ఆవులు ఏనుగుల దాడి నుంచి తప్పించుకున్నాయి. ఆవు మృతితో రైతు వెంకటరమణ తీవ్ర ఆవేదన చెందాడు. ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కోరాడు.
రోడ్డు ప్రమాదం – ముగ్గురికి గాయాలు
ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ దమ్మాయిగూడెంకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. ప్రేమ్నగర్ వద్ద ఆగి ఉన్న లారీని మేడారం వెళ్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవార్ని శ్రీకాంత్, యువశ్రీ, శ్రావణిలుగా గుర్తించి చికిత్సకై ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రికార్డ్ ఓపెనింగ్స్
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా వచ్చిన టిల్లు స్వ్కేర్ భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 23.7కోట్ల గ్రాస్ని రాబట్టింది. హీరో సిద్దూ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాఫ్ జంప్గా నిలిచింది.
500 టీ20 క్లబ్లోకి…
వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల టీ ట్వంటీలు ఆడిన నాలుగో క్రికెటర్గా నిలిచాడు. కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, షోయబ్ మాలిక్లు నరైన్ కంటే ముందున్నారు. కోల్కత్తా, బెంగళూరు మ్యాచ్ అనంతరం నరైన్ మాట్లాడుతూ…టీట్వంటీల్లో అద్భుతమైన మైలురాయి అందుకోవడం ఆనందం గా ఉంది…చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడానంటూ వ్యాఖ్యానించాడు.