ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి పోటీ చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు. దీంతో మరోసారి వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఇటీవలే వయనాడ్లో పోలింగ్ ముగిసింది. కాగా తమ కుటుంబానికి పెట్టని కోటలాంటి రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ పోటీలో ఉన్నారు. రాయ్బరేలీలో ఈనెల 20న పోలింగ్ జరగబోతోంది. దీంతో మొత్తం రెండు నియోజకవర్గాల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్లే లెక్క. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఒక నాయకుడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అంశం తెరమీదకు వచ్చింది.
వాస్తవానికి 1996కు ముందు ఒక వ్యక్తి ఎన్ని నియోజకవర్గాల నుంచైనా పోటీ చేసే అవకాశాలు ఉండేవి. అయితే 1996లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. ఈ సవరణ మేరకు ఎన్నికల్లో పోటీని కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితం చేశారు. అయితే సహజంగా సాధారణ నాయకులెవరూ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయరు. అసలు వారికి ఆ అవకాశం కూడా ఉండదు. సాధారణ నాయకుడికి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ రావడమే గొప్ప. ఆయా పార్టీల అధినేతలను మెప్పించి ఓ టికెట్ తెచ్చుకోవడంతోనే పుణ్యకాలం సరిపోతుంది. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేది నూటికి నూరుశాతం ప్రముఖులే. మనదేశంలో అనేక మంది రాజకీయ దిగ్గజాలకు రెండు సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది. రాజకీయ ప్రముఖులకు ఎన్నికల్లో గెలుపు చాలా కీలకం. కొంతమంది నేతలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలుంటాయి. దీంతో ఎన్నికల్లో గెలవడం వారికి ముఖ్యమవుతుంది. దీంతో ఎలాగైనా గెలవడానికి ప్రముఖులు సర్వశక్తులు ఒడ్డుతుంటారు. ఈ నేపథ్యంలో ఒకచోట ఓడితే మరో చోటనైనా గెలుస్తామన్న ధీమాతో సేఫ్ సైడ్గా రెండు చోట్ల నుంచి బరిలో నిలబడతారు. రెండు సెగ్మెంట్ల నుంచి నాయకుల పోటీకి ఇదే ప్రధాన కారణం.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో ప్రముఖులు రెండు చోట్ల నుంచి గతంలో పోటీ చేశారు.1983 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు రెండు నియోజకవర్గాలు గుడివాడ, తిరుపతి నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల నుంచి ఎన్టీఆర్ ఘన విజయం సాధించారు. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు చిరంజీవి తిరుపతి నుంచి అలాగే పాలకొల్లు నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి నుంచి గెలిచారు. పాలకొల్లు నుంచి ఓటమి పాలయ్యారు. కాగా 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి విశాఖలోని గాజువాక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు సెగ్మెంట్ల నుంచి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు స్థానాల్లో పోటీ చేశారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం, అలాగే గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కేసీఆర్ బరిలో నిలిచారు. రెండు సెగ్మెంట్ల నుంచీ కేసీఆర్ ఆయన గెలిచారు. అయితే మెదక్ లోక్సభ స్థానాన్ని కేసీఆర్ వదులుకున్నారు. గజ్వేల్ సెగ్మెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ అసెంబ్లీలోకి ఆయన అడుగు పెట్టారు.
రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాజకీయ దిగ్గజాల జాబితాలో ఇందిర కూడా ఉన్నారు. 1980లో తెలంగాణలోని మెదక్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ రెండు లోక్సభ నియోజకవర్గాల నుంచి ఇందిరా గాంధీ పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి ఆమె విజయం సాధించారు. అయితే రాయ్బరేలీ సెగ్మెంట్ కు రాజీనామా చేశారు. మెదక్ ఎంపీగానే కొనసాగారు. ఇదే తరహాలో 1999 లోక్సభ ఎన్నికల్లో అమేధీ, బళ్లారి నియోజకవర్గాల నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు.కాగా 2014 లోక్సభ ఎన్నికల్లో వారణాసి, వడోదర రెండు నియోజకవర్గాల నుంచి నరేంద్ర మోడీ పోటీ చేశారు. రెండు సెగ్మెంట్లలోనూ నరేంద్ర మోడీ గెలవడం విశేషం. వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను నరేంద్ర మోడీ ఓడించారు. అలాగే వడోదరలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీని ఓడిం చారు. ఆ తరువాత వడోదర సెగ్మెంట్ కు రాజీనామా చేశారు. వారణాసి ఎంపీగానే నరేంద్ర మోడీ కొనసాగారు.
ఇదిలా ఉంటే, ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడాన్ని నిషేధించాలన్న డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ఇది కొత్త ప్రతిపాదన కాదు. ఎవరైనా సరే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడాన్ని నిషేధించాలని 2004లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అయితే అలనాటి ప్రతిపాదన ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. అయితే కొంతకాలం కిందట ఈ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ నుంచి, తాను ఖాళీ చేసిన నియోజకవర్గం లో ఉప ఎన్నిక నిర్వహణకు అవసరమైన ఖర్చును జరిమానా కింద వసూలు చేయాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. జరిమానా కూడా ఎంత విధించాలో క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఈ ప్రతిపాదన చట్టం కాలేదు.