జై జవాన్ , జై కిసాన్ 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ఈ నినాదం ఇచ్చారు. జవాన్ల త్యాగాలను, రైతులను కష్టాలను ప్రతిబింబిస్తూ జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారు. 1998లో అప్పటి ప్రధాని వాజ్పేయి ఈ నినాదాన్ని మార్చారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని మార్చారు. స్వాతంత్ర్యం అనంతరం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అద్భుత విజయాలను నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల కృషికి గౌరవాన్ని ఇస్తూ వాజ్పేయి ఈ నినాదం ఇచ్చారు.
గరీబీ హటావో 1971 ఎన్నికల్లో ఇందిర ఈ నినాదం ఇచ్చారు. ఈ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం దక్కింది. దేశం నుంచి పేదరికాన్ని పారద్రోలడమే గరీబీ హటావో నినాదం అర్థం. 1971 నాటికి భారతదేశంలో పేదరికం తీవ్రస్థాయి లో ఉంది. పేదరికం కారణంగానే సమాజంలో అంతరాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 1971 ఎన్నికల్లో ఇందిర ఇచ్చిన నినాదం కాంగ్రెస్ విజయానికి మూలకారణమైంది. ఇందిర హటావో, దేశ్ బచావో ఇందిరా గాంధీ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన నినా దం ఇది. 1975-77 మధ్య అప్పటి ప్రధాని ఇందిర ఎమర్జెన్సీ విధించడంతో దేశంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇందిర హటావో, దేశ్ బచావో అంటూ జయప్రకాశ్ నారాయణ్ ఈ పిలుపు నిచ్చారు. దీంతో 1977 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. భారత దేశ చరిత్రలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా పార్టీ సర్కార్ పేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు.
జబ్తక్ సూరజ్ చాంద్ రహేగా ఇందిరా తేరా రామ్ రహేగా , భారతదేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న నివాదం ఇది. 1984లో ఇందిర దారుణహత్యకు గురైన సందర్భంలో ఈ నినాదం వచ్చింది. సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇందిర పేరు ప్రపంచంలో చిరస్థాయిగా ఉంటుందన్నది ఈ నినాదం అర్థం. ఈ నినాదం జనంలోకి దూసుకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇదొక రికార్డు. బారీబారీ సబ్కీ బారీ అబ్కీ బారీ అటల్ బిహారీ 1996లో బీజేపీ ఈ నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. అందరి వంతు అయిపోయింది. ఇప్పుడు వాజ్పేయి వంతు అనే అర్థంలో ఈ నినాదం తీసుకువచ్చారు. లక్నోలో ఒక ఎన్నికల ప్రచారంలో వాజ్పేయి ఈ నినాదం ఇచ్చారు. అప్పట్లో ఈ నినాదం దేశవ్యాప్తంగా పాపులరైంది. బారీబారీ సబ్కీ బారీ అబ్కీ బారీ అటల్ బిహారీ నినాదంతో 96 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే 13 రోజులకే వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది.
భారత్ వెలిగిపోతోంది ఈ నినాదం 2004 ఎన్నికల నాటిదే. అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీయే కూటమి ఇండియా షైనింగ్ నినాదంతో ముందుకెళ్లింది. ప్రపంచ వేదికపై భారత్ ఆర్థిక ఆశావాదానికి సంకేతంగా ఈ నినాదాన్ని తీసుకువచ్చారు. భారతదేశంలో అభివృద్ది శరవేగంగా జరుగు తుందన్న అర్థంలో ఈ నినాదాన్ని తీసుకువచ్చారు. అయితే 2004 నాటి ఎన్నికలలో ఈ నినాదం బీజేపీకి విజయం తీసుకురాలేకపోయింది. అది వేరేవిషయం.
కాంగ్రెస్ కా హాథ్…ఆమ్ ఆద్మీ కా సాథ్ 2004లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించిన నినాదం ఇది. కాంగ్రెస్ నాయకులు వారి పార్టీ గుర్తు అయిన హస్తం ను ప్రత్యేకంగా తీసుకుని ఈ నినాదాన్ని తీసుకువచ్చారు. సామాన్యుడికి కాంగ్రెస్తోనే రక్ష అనే అర్థంలో ఈ నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ నినాదం విపరీతంగా ప్రజాదరణ పొందింది. యూపీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ కా హాథ్ ఆమ్ ఆద్మీ కా సాథ్ నినాదం కీలక పాత్ర పోషించింది. యూపీఏ కూటమికి ప్రాణం పోసింది కాంగ్రెస్ కా హాథ్…ఆమ్ ఆద్మీ కా సాథ్ అనే నినాదం. అచ్చేదిన్ ఆనేవాలే హై భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం ఇది. ఈ నినాదం ఆధారంగా 2014లో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అప్పటి యూపీఏ పాలనలోని లోపాలను, వైఫల్యాలను ఎత్తి చూపుతూ అచ్చేదిన్ ఆనేవాలే హై అంటూ బీజేపీ నినాదం ఇచ్చింది. దీని అర్థం మంచి రోజులు వస్తున్నాయని. ఈ నినాదం సూపర్డూపర్గా హిట్ అయింది. ఈ నినాదం ప్రజల్లోకి వెళ్లింది. బీజేపీకి అధికారం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించింది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి 2019లో కూడా అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తోంది ఎన్డీయే కూటమి.
అబ్ కీ బార్ 400 పార్ ఇది కూడా బీజేపీ ఇచ్చిన నినాదమే. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్న కమలం పార్టీ ఇచ్చిన నినాదం ఇది. ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలవాలన్నదే ఈ నినాదం పరమార్థం. అయితే బీజేపీ స్వంతంగా 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో ఫిర్ ఏక్బార్ మోడీ నినాదంతో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.