ఎన్నికల వేళ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న వారసత్వ పన్నుపై శామ్పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కామెంట్స్ మరువకముందే తాజాగా ఆయన భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలిక వివాదాస్పదమైంది. దీనిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ సీరియర్ నేత శామ్ పిట్రోడా భారతీయుల గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో తూర్పున ఉండే ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ ప్రాంతంలో ఉండేవారు అరబ్బుల్లా, ఉత్తరాదిన ఉండేవారు తెల్లవారిలా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్స్లా ఉంటారన్నారు శ్యామ్ పిట్రోడా. 70 ఏళ్లుగా భారతదేశ గుర్తింపు ఇదే అనేలా ఆయన వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. అయితే పిట్రోడా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేయాల్సివ చ్చింది. ఎన్నికల వేళ పిట్రోడా వ్యాఖ్యలు కొంపముంచుతాయనుకున్నారో ఏమో. వెంటనే ఆయన రాజీ నామాను ఆమోదించింది కాంగ్రెస్ హైకమాండ్.
శామ్ పిట్రోడా కామెంట్స్పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. శరీరం రంగు ఆధారం గా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరిం చారు. మహారాష్ట్రలోని థాకరే వారసులుగా చెప్పు కునే వాళ్లు దీన్ని అంగీకరిస్తారా? అని మోదీ నిలదీశారు. దేశాన్ని రివర్స్ గేర్లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ మదిలో విభజన ఆలోచనలే ఉంటాయని, దేశాన్ని ముక్కలు చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే శామ్ పిట్రోడా రాజీ నామా ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాను దక్షిణ భారత్ నుంచి వచ్చానని, భారతీయురాలిగానే కనిపిస్తున్నానని పేర్కొన్నారు. తన బృందంలో ఈశాన్య భారత్ నుంచి ఉత్సాహవంత మైన సభ్యులు ఉన్నారని, వారూ భారతీయులుగానే కనిపిస్తారన్నారు. జాత్యహంకారానికి మార్గదర్శి అయిన రాహుల్ గాంధీకి మనమంతా ఆఫ్రికన్, చైనీస్, అరబ్, వైట్గా కనిపిస్తామని ఎద్దేవా చేశారు. మీ మనస్తత్వాన్ని, మీ వైఖరిని బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు అంటూ చురక అంటించారు. మరోవైపు శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సినీ నటి ప్రణీత స్పందించారు. ఒక్క మాటలో కౌంటర్ ఇచ్చారు. తాను దక్షిణ భారతీయురాలిని, భారతీయురాలిగానే కనిపిస్తున్నాను అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికల వేళ శామ్ పిట్రోడా రూపంలో కాంగ్రెస్కు కొత్త కష్టాలు వచ్చా యని విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కచ్చితంగా ఆ పార్టీకి మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి.