బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముంది. ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు.