స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో భారత వాయుసేన(IAF)కు చెందిన మిగ్ ఫైటర్ జెట్ విమానం కూలింది. హనుమాన్గఢ్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సూరత్గఢ్ నుంచి టేకాఫ్ అయిన మిగ్ 21 ఫైటర్జెట్ డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడగా.. శిథిలాల కింద పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది జనవరిలో రెండు వేర్వేరు ఘటనలలో సుఖోయ్ సు-30, మిరాజ్-2000 యుద్ధవిమానాలు అకస్మాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే.