మాయం అయిపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ రచయిత అన్నాడు. కొన్ని ఘటనలు చూస్తుంటే ఆ సాహిత్యమే నిజం అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి. సాటి మనిషికి సాయం చేసే వారే కరువైపోతున్నారు. జేబులో పైసా లేదంటే బంధాలు, బంధుత్వాలను కాలిగోటితో సమానంగా చూస్తున్నారు. అదే పైసా ఉంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ పైసల కోసమే ప్రాణాలు సైతం తీస్తున్నారు. కొన్నిచోట్ల అయితే చనిపోయిన వ్యక్తి నుంచి కూడా ఆస్తిని కాజేస్తున్నారు. అలాంటి దుర్మార్గపు ఘటనే ఒక్కటి చోటుచేసుకుంది.
ఆగ్రాలో వయసు పైబడడంతో కమలాదేవి అనే మహిళ కన్నుమూసింది. ఆమె భర్త కొన్నాళ్ల కిందట చనిపోయారు. వారికి పిల్లలు లేరు. దీంతో బంధువులు పిల్లలనే తమ పిల్లలుగా పెంచుకున్నారు. ఈ క్రమంలోనే బంధువులకు వారి ఆస్తి మీద కన్నుపడింది. ఆమె చనిపోవడంతో ఆమె బావ కుమారులు మృతదేహన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తామని చెప్పి.. మధ్యలో ఓ లాయర్ సమక్షంలో వీలునామా కాగితాల మీద చనిపోయిన ఆమె చేతి వేలిముద్రలు తీసుకున్నారు. అక్కడి నుంచి సైలెంట్ గా జారుకుని ఆస్తులు అనుభవిస్తున్నారు.
అయితే పైన దేవుడు అనేవాడే ఒక్కడు ఉంటాడుగా.. వారి కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో బంధువుల్లో ఒక్కరు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2021 మే8వ తేదీని ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆస్తి కోసం ఇంత దారుణానికి పాల్పడతారా అని కామెంట్స్ చేస్తున్నారు.
Video of man taking thumb impression of deceased woman lying in car goes viral.
pic.twitter.com/mZjaz2BvFE— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 10, 2023