ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. మంగపేట మండల కేంద్రంలో నాబార్డ్ నిధులతో నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ ప్రాజెక్ ఆఫీసర్ చిత్రా మిశ్రాతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన
తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనులను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి కంపెనీకి ఇవ్వాలనే డిమాండ్ ఖమ్మంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వెయ్యటాన్ని మానుకోవాలని సీపీఎం నేతలు సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్యర్యంలో ఉన్న సింగరేణిని రాష్ట్రాల హక్కులను హరించి, కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం వేలం వేయాలనుకోవడం దుర్మార్గం అని ఖండించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వేలం పాటలను మానుకోవాలని లేదంటే వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం నేతలు హెచ్చరించారు.
చేతకాని కాంగ్రెస్ సర్కార్- తాతా మధు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు నెరవేర్చలేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే.. వాటిని అమలుకు కూడా కాంగ్రెస్ సర్కార్కు సాధ్యం కావడం లేదని మధు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు, ఉచిత కరెంట్కు సంబంధించిన బిల్లులను ఆయా సంస్ధలకు చెల్లించలేదన్నారు. పక్క రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు చేస్తుంటే తెలంగాణలో 6 నెలల్లో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
ప్రజల సమస్యలడిగి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుమలలోని బాలాజీనగర్ను సందర్శించారు. బాలా జీనగర్లో నివాసం ఉన్నవారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కోరుకున్న కోరికలు నెరవే ర్చారని శ్రీవారికి తలనీలాలు సమర్పించి, మొక్కు చెల్లించినట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. నీరు, డ్రైనేజీ, వర్షం పడినప్పుడు వాననీళ్లు పోయేందుకు కాలువలు ఏర్పాటు చేయాలని తిరుమల ప్రజలు కోరుతున్నారని ఆరణి తెలిపారు. బాలాజీనగర్ అటవీ ప్రాంతం పక్కన ఉండడం వల్ల చిరుతపులులు, అడవి పందులు లాంటి జంతువులు రాకుండా చుట్టూ ఇనుపకంచె ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు సూచించినట్లు చెప్పారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు.