స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో ఇవాళ్టి నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం పది జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఈనెల 10 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని.. ఆ తరువాత తనిఖీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. పరీక్ష రాస్తోన్న 6,455 మందికి 70 బయెమెట్రిక్ యంత్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బయోమెట్రిక్ తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు. పరీక్ష పేపర్ లీకేజీసహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో ట్యాబ్లు ఇచ్చి ఆన్లైన్ ద్వారా పరీక్ష జరపగా.. ఈ సారి దాన్ని తొలగించారు. కేవలం ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 8న గ్రూప్ 1 పరీక్షలు జరుగగా అందులో 6,455 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు.