మానవుల్లో మరో పరివర్తన దిశగా శాస్త్రవేత్తలు దూసుకుపోతున్నారు. మనుషుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియలో మరో కీలక ప్రయోగం జరుగనుంది. ఇందులో భాగంగా ఇద్దరు మగ వ్యక్తులు కలిసి పిల్లల్ని కనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజగా, రెండూ మగ ఎలుకలను ఉపయోగించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు జపాన్ వైద్యులు. భవిష్యత్తులో ఈ విధానం ఇద్దరు పురుషులు కలిసి పిల్లల్ని పొందేందుకు దోహదపడుతుందని అన్నారు.
క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు మొదటగా మగ ఎలుక చర్మ కణాలను తీసుకున్నారు. ఇండ్యూస్డ్ ప్లూరీపొటెంట్ స్టెమ్ (ఐపీఎస్) కణాలను సృష్టించేందుకు ఆ చర్మకణాలను మూలకణాల స్థితికి చేర్చారు. అనంతరం వాటి నుంచి ‘వై’ క్రోమోజోంను తొలగించారు. ఆ స్థానంలో మరో ‘ఎక్స్’ క్రోమోజోంను ప్రవేశపెట్టారు. ఆ కణాలు అండాలుగా తయారయ్యేలా ప్రయోగం చేశారు. అనంతరం ఈ అండాలను మరో ఎలుక వీర్యంతో ఫలదీకరణం చెందించారు. ఈ విధానంలో మొత్తం 600 పిండాలు ఏర్పడ్డాయి. వాటిని సరోగేట్ ఎలుకలో ప్రవేశపెట్టగా.. అది ఏడు ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ ఎలుక పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ ఎలుకలకు జీవశాస్త్రపరంగా రెండు తండ్రి ఎలుకలు (బయోలాజికల్ ఫాదర్) ఉన్నట్లు భావించొచ్చు. ఈ తరహా విధానాన్ని మానవ కణాలపైనా ప్రయోగాత్మకంగా పరిశీలించడం రాబోయే పదేళ్లలో సాధ్యం కావొచ్చని శాస్త్ర వేత్తలు అంటున్నారు