దేశ వ్యాప్తంగా ౩ వందల జిల్లాల్లో తగ్గిన నీటి నిల్వలు
హైదరాబాద్ లో అడుగంటిన భూగర్భ జలాలు
భూగర్భ జలాల శాఖ అనుమతి అవసరం
ఇష్టారీతిన వేసే బోర్ల వలన తప్పని నీటి కష్టాలు
2050 నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట
భూగర్భ జలాలు తగ్గడమే నీటి సంక్షోభానికి ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. గత రెండేళ్లుగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడినప్పటికీ, గ్రౌండ్ వాటర్ తగ్గింది. ఈ పరిణామం అందరినీ కలవరపడుతోంది. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెరగకపోతే తెలంగాణలో పరిస్థితి దారుణంగా మారుతుందని అంటున్నారు నిపుణులు.
నీటి విషయంలో భారత్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 2050 నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చి చెప్పింది. మనదేశంలో భూగర్భజలాలను అతిగా వినియో గించడమే నీటి ఎద్దడికి ఒక కారణమంటున్నారు సైంటిస్టులు. మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల మన దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు తరిగిపోయాయి. దీనిఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడింది. గత రెండు దశాబ్దాలలో దేశవ్యాప్తంగా దాదాపు 300 జిల్లాల్లో భూగర్భజలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో మూడింట రెండు వంతుల మంది భూగర్భజల వనరులను అవసరాలకు మించి వినియోగిస్తున్నట్లు స్పష్టమైంది.
భూమిలోకి నీరు ఇంకిపోవడం ఒక సహజ ప్రక్రియ. భూమిలోకి ఎంత ఎక్కువగా నీరు ఇంకితే అంత ఎక్కువగా భూగర్భజలాల నిల్వలు ఉంటాయి.అయితే నేలతల్లిలోకి ఇంకే నీరు కాలక్రమంలో తగ్గిపోయింది. దీంతో భూగర్భజల మట్టాలు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి. పాతాళంలో కాసిన్ని నీళ్లుఉన్నా వాటిని కూడా ఎడాపెడా బోర్లు వేసి తోడేస్తున్నాం. ఒకవైపు నీటి ఎద్దడి ఉంటే మరో వైపు ఉన్న నీటిని అవసరాలకు మించి ఎడాపెడా వాడేస్తున్నాం. అంతేకాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీళ్లు దొరక్క ఇబ్బందిపడుతుంటే కొన్నిచోట్ల తోటల్లో మొక్కలకు నీళ్లుపోయడానికి తాగునీటిని ఉపయోగిస్తున్నారు.
తెలంగాణలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిణామం అందరినీ కలవరపెడుతోంది. ఒక్క ఏడాదిలోనే భూగర్భ జలాల తగ్గుదల ఎక్కువగా నమోదు కావడం ప్రభుత్వంతో పాటు ప్రజలందరినీ ఆలోచనలో పడేసింది. రెండేళ్లుగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడ్డయి. అయినప్పటికీ గ్రౌండ్ వాటర్ తగ్గడం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. వానలు బాగా పడితేనే పరిస్థితి ఇలా ఉంంది… ఇక సాధారణం కంటే తక్కువ వర్షాలు పడితే ఇంకెలా ఉంటుందో అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. వాస్తవానికి తెలంగాణలో భూగర్భ జలాల లోతు తెలుసుకోవడానికి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటే స్వయంగా 1768 చోట్ల బోర్లు వేసి పరిశీలిస్తూ ఉంటుంది. గత ఏడాది ఫిబ్రవరిలో 7.3 మీటర్లకు నీటి మట్టం ఉంటే ఈ ఫిబ్రవరి కి 8.7 మీటర్లకు చేరింది. 2022 లో వర్షాలు బాగా పడినందుకు 2023 మే నెలలో 8.3 మీటర్లకు నీటిమట్టం చేరింది. అయితే గత ఏడాది వానలు సాధారణం కంటే కొద్ది ఎక్కువగా పడడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నీటిమట్టం సరాసరి 8.7 మీటర్లకు చేరింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మే నెలనాటికి నీటి మట్టం మరింత దిగజారుతుందంటున్నారు నిపుణులు.
నీటి మట్టం 20 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దానిని డేంజర్ జోన్ గా గ్రౌండ్ వాటర్ డిపార్టెమెంట్ పరిగ ణిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో భూపాలపల్లి, భువనగిరి, హైదరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, ఇలా 24 జిల్లాల్లోని 82 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమా దకర స్థాయిలో ఉన్నాయి . ప్రస్తుతం ఒక మనిషి అవసరాల కన్నా తక్కువ భూగర్భ జలాలు ఉండటం అందరినీ కలవరపరుస్తోంది. అంతకుమించి నీటిని మనిషి తోడుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దీనికి ముందుగా చేయాల్సింది నీటి వృధాను అరికట్టాలి. అలాగే చెరువుల కబ్జాలు గురికాకుండా చూసుకోవాలి. వీటన్నిటితో పాటు కొత్తగా చెరువులను తవ్వించాలి. ఇలా చేస్తే భూగర్భ జలాలు మళ్లీ పెరుగుతాయంటున్నారు నిపుణులు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిస్థితులే మరో ఐదేళ్ల పాటు కొనసాగితే తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నీటి పొదుపు విషయ మై ప్రజలను పాలకులు ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఉండాలి. నీటి వృథాను అరికట్టగలగాలి. ఈ విషయంలో రేపటి తరం పౌరులైన విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటాయి. ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో వాననీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాననీటి సంరక్షణ మీద కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వాలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. హైదరాబాద్ నగరంలో దాదాపు ఐదు లక్షల వరకు అపార్ట్మెంట్లున్నాయి. వాన నీటి సంరక్షణ కోసం ప్రతి అపార్ట్మెంట్లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. కొన్నేళ్ల నుంచి ఈ నిబంధన అమలు కావడం లేదు. ఇదిలా ఉంటే దాదాపు ఎనభై శాతం అపార్ట్మెంట్లలో అసలు ఇంకుడుగుంతల ఆనవాళ్లే లేవని తెలుస్తోంది. కాగా ఎండలు పెరుగుతుండటంతో హైదరాబాద్ నగరంలో క్రమక్రమంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాగా మే నెలల్లో భూగర్భ జలాలు మరింతగా తగ్గే అవకాశాలు న్నాయంటున్నారు నిపుణులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే వాల్టా చట్టంగా పాపులర్ అయింది. ముఖ్యంగా భూగర్భ జలాల సంరక్షణే వాల్టా చట్టం ప్రధాన లక్ష్యం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ వాల్డా చట్టాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాదు వాల్డా చట్టాన్ని బలోపేతం చేయడానికి కిందటేడాది జీఓ 15 కూడా విడుదల చేసింది. వాల్టా చట్టం ప్రకారం, విచ్ఛల విడిగా సహజ వనరులు వినియోగించుకునేందుకు వీల్లేదు. వాల్టా చట్టం ప్రకారం నీటి వినియోగం, నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలు, షాపింగ్ కాంప్లెక్స్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, హౌసింగ్ సొసైటీ, మంచి నీటి ప్లాంట్లు సహా అనేక ఇతర ప్రదేశాల్లో బోర్లు వేయడానికి తప్పనిసరిగా భూగర్భ జలాల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ముందస్తుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇష్టారీతిన బోర్లు వేస్తున్నారు. ఎక్కడో పాతాళంలో ఉన్న కాసిన్ని నీళ్లను కూడా ఎడాపెడా తోడి పారేస్తున్నారు.


