నీటి సంక్షోభం ఏ ఒక్క దేశానికీ పరిమితం కాదు. నీటి ఎద్దడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. ఆఫ్రికా సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతం నీటి కొరత నెలకొంది. మిగతా దేశాలతో పోలిస్తే ఆఫ్రికాలో నీటికొరత తీవ్రంగా ఉంది. గుక్కెడు నీటికోసం కిలోమీటర్లు నడిచి వెళ్లే ప్రాంతాలు ఆఫ్రికాలోని అనేక దేశాల్లో కోకొల్లలుగా ఉన్నాయి.
ప్రపంచదేశాల్లో నీటి ఎద్దడి నెలకొన్న విషయాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ నేపథ్యంలో 2022 మార్చి నెలలో మూడు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముందు యునై టెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో అనేక సంచలన విషయాలున్నాయి. నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయస్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటిరంగ నిపుణులు. ప్రపంచదేశాల్లోని ప్రజలందరికీ 2023 నాటి కల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆ లక్ష్యానికి ప్రపంచదేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి ఏడాదికి 600 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిరంగ నిపుణులు పేర్కొన్నారు. ఎడాపెడా పెరుగుతున్న నీటి ఎద్దడి, అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న వైనం, రకరకాల కాలుష్యాలతోపాటు గ్లోబల్ వార్మింగ్ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు. ఈ చేదు వాస్తవాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ నివేదిక గుర్తు చేస్తోందని నిపుణులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా, ఐక్యరాజ్య సమితి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. నీటి సంక్షోభంపై ఎప్పుడో 1977లో అర్జెంటైనాలో ఐక్య రాజ్యసమితి ఒక సమావేశాన్ని నిర్వహించింది. అప్పట్లో 118 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత నీటి సంక్షోభం అనే కీలక అంశాన్ని ఐక్యరాజ్యసమితి మరచి పోయింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా ఐక్యరాజ్యసమితి ఎందుకు పట్టించుకోలేదని నిపుణులు మండి పడ్డారు. కాగా 46 ఏళ్ల తరువాత 2022లో మరోసారి ఐక్యరాజ్యసమితి మూడు రోజుల పాటు నీటి సంక్షోభం పై ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో నీటి ఎద్దడిపై యుద్ధం చేయడానికి నిపుణులు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రపంచ సమస్యగా మారిన నీటి ఎద్దడిని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే భూగోళంపై 80శాతం నీరు విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. తాగడానికి ఉపయోగపడే సురక్షిత నీటి విషయంలో ప్రపంచ దేశాలన్నీ వెనుకబడ్డాయ. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంటుంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యలవల్ల పనికిరాకుండా పోతోంది. దీని ప్రభావం కేవలం మనుషులపైనే కాదు…. సమస్త ప్రాణికోటి, ముఖ్యంగా జలచరాలపై కూడా పడుతోంది. భూగర్భజల కాలుష్యాన్ని నివారించడానికి ప్రభు త్వాలు తీవ్రంగా ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
సహజంగా భారతీయ సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు. కానీ తల్లిగా భావించే గంగ, యమున, గోదావరి వంటి నదుల ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్తా చెదారం, పరిశ్రమల నుంచి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. దీని పర్యవసానంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. ప్రజలకు సురక్షిత నీరు అందిం చాలంటే ముందుగా నదులను కాపాడుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఉంది. ఏమైనా ప్రపంచం లోని మెజారిటీ ప్రజలకు సురక్షిత నీరు ఇప్పటికీ అందని ద్రాక్షే.