స్వతంత్ర వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి చంద్రయాన్ -3తో కూడిన ఎల్వీఎం-3 ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్ -3ని ప్రయోగించారు. జాబిల్లిపై ప్రయోగాలకోసం భారత్ మూడోసారి చేపడుతోన్న ఈ యాత్రపై యావత్ దేశంతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ సహాయంతో నేడు (జులై 14) నింగిలోకి బయలుదేరిన చంద్రయాన్-3.. 3.84లక్షల కి.మీ దూరం ప్రయాణం చేయనుంది. దాదాపు 45 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు చివరి వారంలో చంద్రుడిపై దిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్కడ సురక్షితంగా దిగిన అనంతరం ల్యాండర్, రోవర్లు 14 రోజులపాటు అక్కడ పరిశోధనలు చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.